హైదరాబాద్‌‌లో పెరుగుతున్న సంతాన లేమి జంటలు  | hyderabad familys interested of adoption orphans | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌‌లో పెరుగుతున్న సంతాన లేమి జంటలు 

May 21 2024 7:23 AM | Updated on May 21 2024 7:24 AM

 hyderabad familys interested of adoption orphans

అనాథ పిల్లల దత్తతపై ఆసక్తి 

శిశువిహార్‌లో 186 మంది పిల్లలు.. 2,050 పైగా దరఖాస్తులు

అధిక బరువు..ఆలస్యపు పెళ్లిళ్లు..రోజంతా ల్యాప్‌ట్యాప్‌లతో సహవాసం..కాలుష్యం..మారిన జీవనశైలి..మానసిక ఒత్తిడి..వెరసి నవ దంపతుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.ఎన్ని మందులు వాడినా సంతానం కలుగక..ఒంటరిగా ఉండలేక చాలా మంది యువ దంపతులు అనాథ పిల్లలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. దత్తతకు పిల్లలు కావాలని కోరుతూ ఇప్పటి వరకు 2,050 మంది దంపతులు శిశువిహార్‌కు దరఖాస్తు చేసుకోవడం ఇందుకు నిదర్శనం.  

సాక్షి,  హైదరాబాద్: ఒకప్పుడు పాతికేళ్లకే పెళ్లి చేసుకుని, ఏడాది తిరక్క ముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల వేటలో పడి 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లికి సిద్ధపడుతున్నారు. గంటల తరబడి ల్యాప్‌టాప్‌లతో గడపడం..జంక్‌ఫుడ్‌ అధికంగా తీసుకోవడం, వీకెండ్‌లో పార్టీల పేరుతో మద్యం అతిగా తాగడం వంటి అలవాట్లు స్త్రీ, పురుషుల హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. పెళ్లై నాలుగైదేళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో చివరకు సంతాన సాఫల్య కేంద్రాకు పరుగులు తీస్తున్నారు. ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌ అండ్‌ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌(ఐవీఎఫ్‌), ఇంట్రాసైటో ప్లాస్మిక్‌ స్పెర్మ్‌ ఇంజెక్షన్‌(ఐసీఎస్‌ఐ)చికిత్సలు చేయించుకున్నా..ఫలితం లేక పోవడంతో చివరకు కొందరు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. ఒంటిరిగా జీవించలేక, పిల్లలపై మమకారం చంపుకోలేక అనాథ పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు.  

186 మంది పిల్లలు..2050 దరఖాస్తులు 
గతంతో పోలిస్తే దంపతుల వైఖరిలో చాలా మార్పులు వచ్చాయి. ఆడపిల్లలు ఇంటికి భారమని భావించే రోజులు పోయాయి. శిశు విహార్‌లో పిల్లలను దత్తత తీసుకుంటున్న జంటల జాబితాను పరిశీలిస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం శిశువిహార్‌లో 2050 మందికిపైగా తమ పేర్లను నమోదు చేసుకుని ఉండగా, 186 మంది పిల్లలు మాత్రమే అందుబాటులో ఉన్నారు. దత్తతకు దరఖాస్తు చేసుకున్న వాళ్లలో ఎక్కువ మంది మగపిల్లలు కావాలని కోరగా, అందులో అత్యధికంగా ఏడాదిలోపు పిల్లలను కోరుకుంటున్న వారే అధికం. రంగు, ఎత్తు, బరువు వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆడ శిశువుకు రెండు నుంచి మూడేళ్లు సమయం పడుతుండగా, మగ శిశువుకు ఐదు నుంచి ఆరేళ్లు పడుతోంది. పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నా..అది కూడా గ్యారంటీ లేదు. ఇదిలా ఉంటే గత పదిహేనేళ్లలో శిశువిహార్‌ ద్వారా మొత్తం మూడు వేల మందికిపైనే దత్తత ఇస్తే, కేవలం నాలుగేళ్లలో 798 మంది పిల్లలను మాత్రమే దత్తత ఇవ్వగా, వీరిలో 527 మంది ఆడపిల్లలు ఉన్నారు.

మహిళల్లోనే కాదు పురుషుల్లోనూ.. 
గతంలో 5 నుంచి 10 శాతం మందిలోనే ఇన్‌ఫెరి్టలిటీ సమస్య ఉండేది. ఇప్పుడది 15 నుంచి 20 శాతానికి పెరిగింది. మహిళల కంటే పురుషుల్లోనే ఈ సమస్య ఎక్కువ కని్పస్తుంది. చిన్న వయసులోనే మెనోపాజ్‌ వస్తుండటం వల్ల చాలా మంది రెండోసారి గర్భధారణకు నోచుకోవడం లేదు. దంపతుల్లో ఉన్న బలహీనతను ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. సాధారణ చికిత్సలతో పిల్లలు జని్మంచే అవకాశం ఉన్నా.. ఐవీఎఫ్, ఐయూవీ వంటి చికిత్సల పేరుతో బాధితులను లూటీ చేస్తున్నారు. మంచి ఆహారపు, జీవన శైలి అలవాట్లు, త్వరగా వివాహం చేసుకోవడం ద్వారా సంతాన లేమిని నిరోధించవచ్చు. 
– డాక్టర్‌ బాలాంబ, సీనియర్‌ గైనకాలజిస్ట్‌

ప్రాధాన్యతను బట్టి కేటాయింపు 
గతంతో పోలిస్తే పిల్లలను దత్తతకు తీసుకునే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. దత్తతకు ఇక్కడ పిల్లలు లేక చాలా మంది నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా వందకుపైగా దరఖాస్తులు అందుతున్నాయి. దంపతుల అభీష్టం మేరకు పిల్లలను దత్తత ఇస్తున్నాం. విదేశాల్లో స్థిరపడిన వారు కూడా ఇక్కడి పిల్లలను దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న దంపతుల ప్రాధాన్యతను బట్టి పిల్లల దత్తతకు అవకాశం కలి్పస్తున్నాం. 

 – మోతీ నాయక్, అదనపు డైరెక్టర్, శిశువిహార్‌ 

Advertisement
 
Advertisement
Advertisement