యాంకర్‌ సాంబశివరావు అక్రమాలకు చెక్‌ | HPCL Seize TV5 Anchor Sambasiva Rao Illegal Petrol Bunk Land | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు.. యాంకర్‌ సాంబశివరావు అక్రమాలకు చెక్‌

Feb 21 2024 11:48 AM | Updated on Feb 21 2024 12:35 PM

HPCL Seize TV5 Anchor Sambasiva Rao Illegal Petrol Bunk Land - Sakshi

టీవీ 5 ఆన్‌ చేయగానే.. సుద్దపూస ముచ్చట్లతో వార్తల్లో కనిపించే సాంబశివరావు వ్యవహారాలు.. 

హైదరాబాద్‌, సాక్షి: టీవీ5 యాంకర్ సాంబశివ రావు అక్రమాలకు అడ్డుకట్ట పడింది. తమనే బురిడీ కొట్టించిన ప్రయత్నంపై హెచ్‌పీసీఎల్‌(Hindustan Petroleum Corporation Limited ) తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో.. మాదాపూర్‌లో నకిలీ ల్యాండ్ ధ్రువ పత్రాలతో నడుపుతున్న పెట్రోల్ బంక్ స్థలాన్ని హెచ్‌పీసీఎల్‌ అధికారులు సీజ్ చేశారు.

ఈ వ్యవహారంపై మొన్నీమధ్యే కేసు నమోదైన సంగతి తెలిసిందే. ల్యాండ్‌ ఓనర్‌ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్‌ పోలీసులు సాంబశివుడిపై, ఆయన కుటుంబ సభ్యులపై ఛీటింగ్‌ కేసు నమోదు చేశారు.

ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా.. ఇటు భూమి యజమానిని, అటు హెచ్‌పీసీఎల్‌ను సాంబశివరావు కుటుంబం బురిడీ కొట్టించాలని చూశాడు. ఈ క్రమంలో.. ల్యాండ్ ఓనర్ కి తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో బంక్ నడుపుతున్న విషయాన్నీ హెచ్‌పీసీఎల్‌ గుర్తించింది. ఆక్రమిత ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ చెప్పింది కూడా. అంతేకాదు.. ఈ వివాదాన్ని పరిష్కరించాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో ఆక్రమిత బంక్‌ స్థలాన్ని అధికారులు సీజ్‌ చేశారు.

పచ్చమీడియాలో భాగమైన టీవీ5 ద్వారా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సాంబశివరావుపై ఈ కేసులో ప్రధాన అభియోగాలు నమోదయ్యాయి. సాంబశివరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమను మోసం చేసారంటూ బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో 600 చదరపు మీటర్ల స్థలం విషయంలో ఈ వివాదం నెలకొంది. పెట్రోల్ బంక్ కోసం ఈ స్థలం కూడా కలిపి సాంబ కుటుంబ సభ్యులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ తో లీజ్ కు ఇచ్చినట్లుగా ఒప్పందం చేసుకున్నారన్నది బాధితుల ఆరోపణ.

దీని పైన తాము సాంబశివరావును, ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించగా అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ను వారి పేరు మీదికే బదిలీ చేస్తామని నమ్మించారని చెబుతున్నారు. ఎంత కాలం అయినా చెప్పిన విధంగా చేయకపోవటంతో అనుమానం వచ్చిన ఫిర్యాదు దారులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ అధికారులను కలిశారు. అక్కడ తమకు ప్రమేయం లేకుండానే తాము HPCLకు తమ స్థలం లీజుకు ఇచ్చినట్లుగా సంతకాలు చేసినట్లు.. ఈ డాక్యుమెంట్లు అన్నీ దురుద్దేశపూర్వకంగా రూపొందించినట్టు గుర్తించారు. కంపెనీ ప్రతినిధులకు బాధితులు అసలు విషయాన్ని మొర పెట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement