
ఫలితాలు వెల్లడించిన ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి
సాక్షి, హైదరాబాద్: న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీ లాసెట్)లో 30,311 (66.46 శాతం) అర్హత సాధించారు. మూడేళ్లు, ఐదేళ్లు, పీజీ లాసెట్కు మొత్తం 57,715 మంది దరఖాస్తు చేయగా, 45,609 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 30,311 మంది అర్హత సాధించారు. లాసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి బుధవారం వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మండలి వైస్చైర్మన్లు ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్కే.మహమ్మూద్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, సెట్ కన్వినర్ ప్రొఫెసర్ బి.విజయలక్ష్మి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ తదితరులు పాల్గొన్నారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 82.19 శాతం ఉత్తీర్ణత సాధించగా, నిజామాబాద్ 59.24 శాతంతో ఆఖరి స్థానంలో ఉందని బాలకిష్టారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అన్ని కోర్సులకు కలిపి 31 కాలేజీలున్నాయని, ఇందులో 8,680 సీట్లు ఉన్నాయన్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే...
బోథ్: తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ఐదేళ్ల లా కోర్సులో టాప్ ర్యాంకు సాధించినట్టు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన రుతిక తెలిపారు. లా చదవాలనే ఆకాంక్షతోనే సీరియస్గా ప్రిపేర్ అయ్యానని చెప్పారు.
సివిల్స్ టార్గెట్
సిద్దిపేటజోన్: మూడేళ్ల లా కోర్సులో మూడో ర్యాంకు సాధించిన సిద్దిపేటకు చెందిన మాడుగుల శిరీష్ శర్మ సివిల్స్ సాధించడమే తన టార్గెట్ అని చెప్పారు. బీటెక్ పూర్తిన చేసిన శిరీష్ ఉద్యోగ ప్రయత్నాల్లోనే భాగంగానే లాసెట్ రాశాడు. ఆయన తండ్రి సిద్దిపేట రూరల్ ఎంపీడీఓగా పనిచేస్తున్నారు.