High Temperature For Another Two Days In Andhra Pradesh And Telangana - Sakshi
Sakshi News home page

వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో రెండు రోజులు భగభగలే

May 18 2023 2:17 AM | Updated on May 18 2023 9:43 AM

High Temperatures for another two days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని, సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్‌ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో దూరప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని శాఖ అధికారులు సూచించారు.

కాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని పేర్కొంది. బుధవారం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి మినహా రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 46.4 డిగ్రీ సెల్సియస్‌ నమోదుకాగా, ఖమ్మం జిల్లా ఖానాపూర్‌లో 45.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే...ఖమ్మం జిల్లా ఖానా పూర్‌లో 45.4 డిగ్రీల సెల్సియస్, ఖమ్మంలో 43.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 23.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 

ఏపీలో ఠారెత్తిస్తున్న ఉష్ణోగ్రతలు 
ఏపీలో సూర్యుడి ప్రతాపం కొనసాగుతోంది. బుధవారం రాయలసీమ జిల్లాల్లో ఎండ నిప్పులు చెరిగింది. తిరుపతి జిల్లా పల్లాం, నెల్లూరు జిల్లా కసుమూరులో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట అనేక ప్రాంతాల్లో 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement