
సాక్షి, హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంచైజీ, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్(HCA) వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావును తెలంగాణ సీఐడీ బుధవారం అరెస్ట్ చేసింది. జగన్తోపాటు హెచ్సీఏ ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ సిఫార్సు మేరకు సీఐడీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
గత ఐపీఎల్ సీజన్లో హెచ్సీఏ-ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల వివాదం జరిగిన సంగతి తెలిసిందే. హెచ్సీఏ ప్రెసిడెంట్ హోదాలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని జగన్మోహన్రావు బెదిరించారన్నది ప్రధాన అభియోగం. అయితే ఆ అభియోగాలన్నీ వాస్తవమేనని విజిలెన్స్ నిర్ధారించడంతో సీఐడీ ఇప్పుడు అరెస్టులు చేసింది.
హెచ్సీఏకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం 10 శాతం టికెట్లు ఉచితంగా ఇస్తోంది. అయితే మరో 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్లు జరగబోనివ్వమని ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. అయితే హెచ్సీఏ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆలోచన చేస్తామని ఆ సమయంలో హెచ్ఆర్ఎస్ ఆయనకు స్పష్టం చేసింది. అయితే..
తనకు వ్యక్తిగతంగా 10 శాతం వీఐపీ టికెట్లు కచ్చితంగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్లు జరగనివ్వబోమని ఆయన బెదిరింపులకు దిగారు. అందుకు ఎస్ఆర్హెచ్ అంగీకరించలేదు. దీంతో లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ కార్పొరేట్ బాక్స్కు ఆయన తాళాలు కూడా వేయించారు. ఈ పరిణామంతో షాక్ తిన్న ఎస్ఆర్హెచ్ యాజమాన్యం.. హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామంటూ ప్రకటించడం సంచలన చర్చకు దారి తీసింది.
ఐపీఎల్ టికెట్ల వివాదం నేపథ్యంతో ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ వ్యవహారంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్సీఏ అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన సీఐడీ.. ఇప్పుడు ఆ అక్రమాలు వాస్తవమేనని తేలడంతో ఏకంగా అరెస్టులు చేసింది.