అప్పుల కోసం వందల కోట్ల కమీషన్లు | Harish Rao Shocking Comments on CM Revanth Reddy: Telangana | Sakshi
Sakshi News home page

అప్పుల కోసం వందల కోట్ల కమీషన్లు

Jun 12 2026 4:29 AM | Updated on Jun 12 2026 4:29 AM

Harish Rao Shocking Comments on CM Revanth Reddy: Telangana

ఆ కమీషన్లతోనే ముంబై బ్రోకర్‌ ఏకంగా విమానం కొన్నాడు 

అన్నీ బయటపెడ్తాం: హరీశ్‌రావు  

లిడ్‌క్యాప్, చేనేత సంస్థను కాదని గుజరాత్‌లోని మార్వాడీకి రూ. 2,000 కోట్ల కాంట్రాక్టు 

కమీషన్ల అంశం తేలకపోవడంతోనే బడుల ప్రారంభం వాయిదా 

మీనాక్షి నటరాజన్‌ కేసుకు సంబంధించి బీజేపీకి సమాచారం ఇచ్చిందే రేవంత్‌రెడ్డి సన్నిహితుడు 

ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తాం.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తే వ్యతిరేకించం    

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అప్పుల కోసం ముంబైలోని బ్రోకర్‌కు వందల కోట్ల కమీషన్లు ముట్టచెప్పిందని బీఆర్‌ఎస్‌ఎల్‌పీ ఉపనాయకుడు హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కమీషన్లతోనే ఆ బ్రోకర్‌ ఏకంగా విమానం కొన్నా రని ఆయన స్పష్టం చేశారు. తాము కేంద్ర కార్పొరేషన్ల నుంచి రుణాలు తెస్తే రేవంత్‌ సర్కార్‌ మాత్రం రుణాలు తెచ్చుకోవడానికి కొత్తగా కమీషన్లు ఇచ్చే సంస్కృతి మొదలెట్టిందన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో సహా త్వరలోనే బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు.

గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్‌ నిర్మించి అక్కడ ప్రజలను కలిసేవారని, దానిని కూడా రాజకీయం చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు వీవీఐపీ గెస్ట్‌ హౌస్‌ పేరిట రూ. 7 కోట్లకు జీవో ఇస్తే ఇప్పటికే దానికి రూ.70 కోట్ల వ్యయం అయిందన్నారు.

దాని చుట్టూ రక్షణ కోసం 17 కోట్లతో ఇనుప కంచె వేశారని, మరో 10 కోట్లతో ఫుట్‌బాల్‌ స్టేడియం నిర్మించుకుని బోధి పెవిలియన్‌ అని పేరు పెట్టుకున్నారని విమర్శించారు. సిటీ పోలీసు కమిషనర్‌ కార్యాలయం, ఫ్యూచర్‌సిటీ, సచివాలయం, ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో క్యాంపు కార్యాల యాలు ఉన్నా మరొకటి ఎందుకని విమ ర్శించారు. సీఎం ప్రతీనెలా హెలికాప్టర్‌కు రూ. 2 కోట్లు వ్యయం చేస్తున్నారని, అదీ చాలదని ఇప్పుడు రూ.5 కోట్లకు మరింత అధునాతన హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారన్నారు.  

రూ. 2,000 కోట్ల కుంభకోణం.. 
పాఠశాల, గురుకుల విద్యార్థులకు అవసర మైన దుస్తులు, బూట్లు, బెల్ట్‌ వంటివి చేనేత సహకార సంస్థ, లిడ్‌క్యాప్‌ నుంచి తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చేవారని, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కమీషన్లకు కక్కుర్తిపడి దాదాపు రూ. 2,000 కోట్ల కాంట్రాక్టును గుజరాత్‌కు చెందిన మార్వాడీకి కట్టబెట్టారని ఆరోపించారు. విద్యార్థుల కు పాఠశాల తెరిచే నాటికి దుస్తులు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకు కనీసం వస్త్రం రానేలేదని, అందుకే సాధారణంగా జూన్‌ 12న ప్రారంభం కావాల్సిన పాఠశాలలు వాయి దా వేశారని ఆరోపించారు. కాంట్రాక్టు పొందిన సంస్థతో కమీషన్లకు సంబంధించి తుది నిర్ణయం కాకపోవడంతో ఆలస్యమవుతోందని ఆరోపించారు. గురుకులాల విద్యార్థుల కు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, దుస్తులు కూడా రాలేదని దుయ్యబట్టారు.  

మీనాక్షి కేసు లీక్‌పై విచారణ జరపండి. 
మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్‌ వేసిన నామినేషన్‌ తిరస్కరించడానికి సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితుడే బీజేపీ నేతలకు కేసు వివరాలను అందించారని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రతీ దానికి సిట్, న్యాయ విచారణ, సీబీఐ, సీఐడీ విచారణ అనే సీఎం రేవంత్‌రెడ్డి మీనాక్షి కేసు సమాచారం లీక్‌ చేసిన ఘటనపై విచారణ జరిపించి నిగ్గుదేల్చాలన్నారు.

ఫార్మాసిటీ రద్దుతో రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రం నుంచి తరలిపోయాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్‌ సిటీ ని రద్దు చేస్తామని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలా లు ఇస్తే తాము వ్యతిరేకించమని, అయితే వివాదాలు లేని స్థలాలు ఇవ్వాలని కోరారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల జీవో 111ను ఎత్తేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. తమ పార్టీ గురించి పదేపదే సీఎం మాట్లాడుతున్నారంటేనే.. తమ పార్టీ బలంగా ఉన్నట్లు లెక్క అని అన్నారు. ప్రతీరోజు కేసీఆర్, బీఆర్‌ఎస్‌ పార్టీ పేరెత్తకుండా సీఎం ఉండలేరని వ్యాఖ్యానించారు. 

Advertisement
 
Advertisement
Advertisement