
పెద్ద ధన్వాడలో రైతులపై కేసులు, అరెస్టులు దుర్మార్గం
బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపాటు
సాక్షి, హైదరాబాద్: బీద రైతుల కడుపుకొట్టి వారి భూములను బడా పారిశ్రామికవేత్తలకు కారు చౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తనకు నచ్చిన బడాబాబుల కోసం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతూ భూములను బలవంతంగా సేకరించే బాధ్యతను సీఎం భుజాన వేసుకున్నారని ఆరోపించారు. దీంతో రైతులపై తరచూ ప్రైవేటు వ్యక్తులు, పోలీసులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
జోగుళాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి చెందిన బౌన్సర్లు, పోలీసులు రైతులపై విచక్షణారహితంగా దాడి చేయడం అమానుషమని ‘ఎక్స్’లో గురువారం పోస్టు పెట్టారు. పాలమూరు బిడ్డనని పదేపదే చెప్పుకునే సీఎం.. తన సొంత జిల్లాలో ఘటన జరిగినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు పెద్ద ధన్వాడతోపాటు మొత్తం 12 గ్రామాల రైతులపై దాడి చేసి, 40 మందిపై కేసులు నమోదుచేశారని, 12 మందిని రిమాండ్కు పంపారని తెలిపారు.
రైతులపై దాడి చేయించిన ఇథనాల్ ఫ్యాక్టరీ యజమాని, బౌన్సర్లపై కేసులు ఎందుకు పెట్టలేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద ధన్వాడ తరహా ఘటనలు ఏడాదిగా రాష్ట్రంలో అనేకచోట్ల జరుగుతున్నాయని విమర్శించారు. పెద్ద ధన్వాడ ఘటనలో అరెస్టు చేసిన 12 మంది రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం హరితహారం
మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే తెలంగాణలో పచ్చదనం 24 శాతం నుంచి 31 శాతానికి పెరిగిందని హరీశ్రావు అన్నారు.