నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఊట్కూరు ప్రాథమిక పాఠశాల ఆవరణలోని చెట్ల కిందనే ఉన్నత పాఠశాల తరగతులను నిర్వహిస్తున్నారు. సరిపడా తరగతి గదుల్లేక 6 నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు డిజిటల్ బోధనకు దూరమయ్యారు. నిధులు మంజూరైనా స్థలం లేదంటూ భవనాన్ని నిర్మించడం లేదు. ప్రాథమిక పాఠశాలలోని రెండు గదుల్లో ఒకటి పాఠశాల కార్యకలాపాలకు, మరొకటి పదో తరగతి విద్యార్థులకు బోధిస్తుండగా, మిగతా తరగతులను చెట్ల కింద బోధిస్తున్నారు.
వసతుల్లేని ప్రభుత్వ పాఠశాలలు
సరిపడాలేని మరుగుదొడ్లు.. ఒంటికైనా, రెంటికైనా తప్పని లైన్లు
వర్షం వస్తే అంతే సంగతులు, ఆ రోజు అప్రకటిత సెలవే..
ఏటా రూ.కోట్లు వెచ్చిస్తున్నా గాడిన పడని సర్కారీ చదువులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సరిపడా తరగతి గదుల్లేక వరండాలు, చెట్ల కిందే చదువులు కొనసాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేక ఒంటికైనా, రెంటికైనా క్యూలో నిలబడాల్సి వస్తోంది. వర్షం పడితే అప్రకటిత సెలవు ప్రకటించే దుస్థితి ఏర్పడింది.
ఏటా రూ. 2,500 కోట్లు
ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే రాష్ట్రంలో విద్యా శాఖ పరిధిలో 24,984 పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు ఉండగా, వాటిల్లో 19,45,805 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలలు, సెంట్రల్ స్కూల్స్, సంక్షేమ గురుకులాలను కలుపుకుంటే రాష్ట్రంలో 39,789 పాఠశాలలు ఉండగా, 68,73,019 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో ప్రభుత్వ స్కూళ్ల కోసమే ప్రభుత్వం ఏటా సమగ్ర శిక్షా అభియాన్ కింద 2,044 కోట్లు ఖర్చు చేస్తోంది. మధ్యాహ్న భోజనం కింద మరో రూ. 600 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది.
సదుపాయాలు అంతంతే
ప్రభుత్వ పాఠశాలలకు పెద్ద ఎత్తున నిధులను వెచ్చించినా, మౌలిక వసతులు చేకూరడం లేదు. కనీసం బాల బాలికలకు వేర్వేరుగా పూర్తి స్థాయిలో టాయిలెట్ సదుపాయం కూడా కల్పించలేకపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో బాలుర టాయిలెట్లు 83.6 శాతమే ఉండగా, బాలికలకు ప్రత్యేకంగా 91.4 శాతం టాయిలెట్లు ఉన్నాయి. 
నిర్మాణాలు చేస్తున్నా..తరగతి గదుల కొరతే
పాఠశాలలకు పక్కా భవనాలు, అదనపు తరగతి గదులకు ప్రభుత్వం రూ.వందల కోట్లు వెచ్చిస్తోంది. అయినా విద్యార్థులకు చెట్ల కింద చదువులు తప్పడం లేదు. కొన్నిచోట్ల ఒకే గదిలో రెండు మూడు తరగతులుకు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. 2024–25 కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే ప్రభుత్వ, ప్రైవేట్ కలుపుకొని రాష్ట్రంలో 43,154 పాఠశాలలు ఉంటే అందులో బాలికలకు ప్రత్యేకంగా 39,454 టాయిలెట్లు మాత్రమే పని చేసేవి ఉన్నాయి. 36,085 మాత్రమే బాలుర టాయిలెట్లు పని చేస్తున్నాయి. అంటే 3700 బాలికల టాయిలెట్లు, 7,069 బాలుర టాయిలెట్ల కొరత నెలకొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2024 నుంచి ఇప్పటివరకు అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ప్రభుత్వం రూ.706 కోట్లు వెచ్చించి 58,632 నిర్మాణాలు చేపట్టినట్టు ప్రభుత్వ నివేదికల్లోనే పేర్కొంది. ఇందులో టాయిలెట్లు, తరగతి గదులు, ప్రహరీల నిర్మాణానికి రూ.510 కోట్లు వెచ్చించామని చెబుతున్నా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
మధ్యాహ్న భోజన వర్కర్ ఇల్లే పాఠశాల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నారాయణపురంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం గత ఏడాది ఆగస్ట్లో కురిసిన వర్షాలకు పాడైంది. అప్పటి నుంచి స్లాబ్ నుంచి పెచ్చులు ఊడి పడటంతోపాటు కురుస్తోంది. దీంతో పాఠశాలను మధ్యాహ్న భోజనం వర్కర్ ఇంటి వసారాలో రేకుల కింద తరగతులు నిర్వహిస్తున్నారు. 
బిల్లులు రాక...నిర్మాణాలు జరగక
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని ముత్యాల నగర్ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఒక గదిలో రెండు తరగతుల విద్యార్థులకు, వరండాలో మూడు తరగతుల విద్యార్థులను కూర్చోబెట్టి ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ఒక్కో సారి చెట్ల కింద కూర్చోబెడుతున్నారు. మూడేళ్ల కిందట ఈ పాఠశాలకు 4 గదులు మంజూరయ్యాయి. ఆ గదులు నిర్మాణంలో ఉండగా బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు.
జెడ్పీ పాఠశాలలోనూ...
ఇది నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి.ఇక్కడ 9 గదులున్నా లైబ్రరీ, స్టాఫ్ రూమ్, కంప్యూటర్ ల్యాబ్, ఆఫీస్ రూం కోసం నాలుగు గదులను కేటాయించారు. మిగతా ఐదు గదులున్నా సరిపోకపోవడంతో చెట్టు కింద పాఠాలు చెప్పాల్సి వస్తోంది.


