భర్తవి కాకుండా ఇతరుల శుక్ర కణాలతో ‘సృష్టి’! | Gopalapuram police file complaint against Test Tube Baby Center in Secunderabad | Sakshi
Sakshi News home page

భర్తవి కాకుండా ఇతరుల శుక్ర కణాలతో ‘సృష్టి’!

Jul 27 2025 5:20 AM | Updated on Jul 27 2025 10:27 AM

Gopalapuram police file complaint against Test Tube Baby Center in Secunderabad

సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌ నిర్వాకం 

మగబిడ్డకు కేన్సర్‌ అని తేలడంతో దంపతులకు అనుమానం  

డాక్టరు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో డీఎన్‌ఏ టెస్టు.. వెలుగు చూసిన మోసం 

వైద్యురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు  

కేంద్రంలో వైద్య, పోలీసు, రెవెన్యూ అధికారుల తనిఖీలు 

హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ‘సృష్టి’సెంటర్లు

రాంగోపాల్‌పేట్‌ (హైదరాబాద్‌): పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల బాలుడి ఆరోగ్యంపై అనుమానంతో దంపతులు డీఎన్‌ఏ టెస్టు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. దీంతో వారు రెజిమెంటల్‌ బజార్‌లోని సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌పై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్, సికింద్రాబాద్‌ ఆర్డీవో సాయిరాం, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ వెంకటితో పాటు క్లూస్‌ టీం, వైద్య బృందాలు సెంటర్‌లో తనిఖీలు చేపట్టారు.

విశ్వసనీయ సమాచారం మేరకు.. నగరానికి చెందిన ఓ జంట పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక పోవడంతో రెండేళ్ల క్రితం సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ నిర్వహిస్తున్న డాక్టర్‌ నమ్రతను ఆశ్రయించారు. అక్కడ ఐవీఎఫ్‌ ప్రక్రియ అనంతరం వారికి మగబిడ్డ పుట్టా డు. అయితే ఇటీవల బాబు అనారోగ్యానికి గురికావడంతో వైద్యులను సంప్రదించారు. వివిధ రకాల పరీక్షల తర్వాత బాబుకు క్యాన్సర్‌ ఉందని తేలడంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు. 

తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు ఎవరికీ క్యాన్సర్‌ చరిత్ర లేకపోవడంతో, అనుమానం వచ్చి డాక్టర్‌ నమ్రతను గట్టిగా నిలదీశారు. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో బాబుకు డీఎన్‌ఏ టెస్టు లు చేయించగా.. ఆ దంపతుల డీఎన్‌ఏతో మ్యాచ్‌ కాలేదు. దీంతో డాక్టర్‌ నమ్రత తమను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలిసి పరారీలో ఉన్న డాక్టర్‌ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.  

లోతుగా దర్యాప్తు: డీసీపీ రష్మీ పెరుమాళ్‌ 
సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీసీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు. లోతైన దర్యాప్తు కోసం పోలీసులతో పాటు మెడికల్, రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అంత ర్రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 

విశాఖ కేసులో లైసెన్సు రద్దు చేసినా.. 
డాక్టర్‌ నమ్రత హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి, పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. డాక్టర్‌ నమ్రతను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆమె లైసెన్సును రద్దు చేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో ఇతర డాక్టర్ల లైసెన్సుల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది. కాగా కేపీహెచ్‌బీలోని టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో కూడా ఇలాగే అక్రమ సరోగసీ కేసు నమోదైనట్లు సమాచారం.  

విశాఖలో తాజాగా మేనేజర్‌ అరెస్టు 
ప్రస్తుత కేసుకు సంబంధించి హైదరాబాద్‌ గోపాలపురం పోలీసులు విశాఖ జిల్లా పరిషత్‌ ప్రాంతంలో ఉన్న సృష్టి బేబీ సెంటర్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ సెంటర్‌ ద్వారా ఇప్పటివరకు ఎంతమందికి ఐవీఎఫ్‌ చికిత్స అందించారన్న వివరాలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ఒక మహిళా మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement