
సాక్షి, హైదరాబాద్: ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు(ఓఎంసీ)లో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్థన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు తాజాగా నిలుపుదల చేసింది. ఈ క్రమంలో గాలి జనార్థన్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా జనార్థన్ రెడ్డి.. దేశం విడిచి వెళ్లవద్దని.. ఆయన పాస్పోర్టును సరెండర్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
కాగా, ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు(ఓఎంసీ)లో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలంటూ కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్ధన్రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై హైకోర్టులో మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. బుధవారం తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్ ను దోషులుగా తేల్చుతూ సీబీఐ కోర్టు గత నెల 6న వారికి ఏడేండ్ల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పును గాలి జనార్దన్రెడ్డి ఇతరులతోపాటు ఓఎంసీ కంపెనీ కూడా హైకోర్టులో సవాల్ చేసింది. వాదనల అనంతరం కోర్టు స్పందిస్తూ.. మధ్యంతర అభ్యర్థనలపై బుధవారం ఉత్తర్వులు వెలువరిస్తామని ప్రకటించింది. తాజాగా బెయిల్ మంజూరు చేసింది.