breaking news
Obulapuram Mining case
-
గాలి జనార్థన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు(ఓఎంసీ)లో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్థన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు తాజాగా నిలుపుదల చేసింది. ఈ క్రమంలో గాలి జనార్థన్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా జనార్థన్ రెడ్డి.. దేశం విడిచి వెళ్లవద్దని.. ఆయన పాస్పోర్టును సరెండర్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.కాగా, ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు(ఓఎంసీ)లో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలంటూ కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్ధన్రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై హైకోర్టులో మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. బుధవారం తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్ ను దోషులుగా తేల్చుతూ సీబీఐ కోర్టు గత నెల 6న వారికి ఏడేండ్ల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పును గాలి జనార్దన్రెడ్డి ఇతరులతోపాటు ఓఎంసీ కంపెనీ కూడా హైకోర్టులో సవాల్ చేసింది. వాదనల అనంతరం కోర్టు స్పందిస్తూ.. మధ్యంతర అభ్యర్థనలపై బుధవారం ఉత్తర్వులు వెలువరిస్తామని ప్రకటించింది. తాజాగా బెయిల్ మంజూరు చేసింది. -
వైఎస్ను దోషిగా నిలబెట్టాలని చూశారు: సబితా ఇంద్రారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ఓబుళాపురం మైనింగ్ అంశంలో ఎలాంటి తప్పు చేయకపోయినా పన్నెండున్నర సంవత్సరాలపాటు అవమానాలు భరించా. మానసిక వేదన అనుభవించా. న్యాయ వ్యవస్థపై నమ్మకంతో ఇన్నాళ్లూ పోరాడా. అంతిమంగా న్యాయం గెలిచింది. వాస్తవాలను పరిశీలించిన సీబీఐ కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించడం ఆనందంగా ఉంది’అని మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజకీయ ప్రేరేపితంగా ఈ కేసు నమోదు చేశారని ఆమె వ్యాఖ్యానించారు. ‘నన్ను ముందు పెట్టి అన్న వై.ఎస్. రాజశేఖరరెడ్డిని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నించారు. మేము ఈ మైనింగ్ లీజు వ్యవహారంలో ఎలాంటి తప్పు చేయలేదు. చట్టపరంగా, న్యాయపరంగానే అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. కేబినెట్ ఆమోదంతోపాటు కేంద్ర ప్రభుత్వ అనుమతులు సైతం ఉన్నాయి. విధానపరమైన నిర్ణయంలో ఎక్కడా మేము తప్పు చేయలేదు. మాపై మోపిన అభియోగాలను నిరూపించలేకపోయారు. కాబట్టే న్యాయస్థానం నన్ను నిర్దోషిగా ప్రకటించింది’అని సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. అంతా చట్టబద్ధమే..: కృపానందం ‘ఓబుళాపురం మైనింగ్ లీజు విషయంలో చట్ట నియమ నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం. ఎక్కడా పొరపాటు చేయలేదు. న్యాయపరంగా కూడా ఎక్కడా తప్పు చేయలేదు. అందుకే న్యాయస్థానం ఈ కేసు నుంచి నన్ను నిర్దోషిగా ప్రకటించింది’అని అప్పట్లో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన బి. కృపానందం అనందం వ్యక్తం చేశారు. గనుల లీజు అంశం కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనేది కాదని.. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే మంజూరు అవుతాయని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. మొదటి రెండు చార్జిషీట్లలో తమ పేర్లు లేకపోయినా మూడో చార్జిషీట్లో సీబీఐ తన పేరు ఎందుకు చేర్చిందో ఆ సంస్థకే తెలియాలన్నారు. గనులను లీజుకిచ్చే విధానపరమైన నిర్ణయంలో ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానం నమ్మినందునే నిర్దోషిగా తనను, ప్రజాప్రతినిధిని ప్రకటించిందని ఆయన చెప్పారు. జైలుకు పోతానని ప్రత్యర్థులు హేళన చేసినా..‘కన్నీళ్లతో తొలిసారి ఇదే సీబీఐ కోర్టు మెట్లెక్కా. నేను అవినీతికి పాల్పడ్డానని.. జైలుకు పోతానని నా ప్రత్యర్థులు హేళన చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ అవినీతి చేశానని.. దోపిడీకి పాల్పడ్డానని ఎన్నో నిందలు, ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అన్న వై.ఎస్. రాజశేఖరరెడ్డిని, నన్ను దోషులుగా నిలిపేందుకు ప్రయత్నించారు. మా నైతికతను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ప్రత్యర్థులు ఎన్ని ఆరోపణలు, నిందలు మోపినా నా నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్ముకొని నా వెంట నిలిచారు. నేను బాధపడ్డప్పుడు ఇంట్లోని వారంతా నాకు ఎంతో ఆప్యాయతతో సహకారం అందించారు. కోర్టుకు వెళ్లినప్పుడు నా ప్రజలు వెంట వస్తే లాఠీచార్జి చేసిన పరిస్థితులు ఉండేవి. మేము ఎలాంటి తప్పు చేయలేదన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లా. నా నమ్మకం గెలిపించింది. ఏళ్లుగా ఎదుర్కొంటున్న బాధ నుంచి బయటపడ్డా. ఇక మరింత ఉత్సాహంతో ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తా’అని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. -
ఓబుళాపురం మైనింగ్ కేసు.. సబిత నిర్దోషి
సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. గనుల శాఖ మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి కృపానందంలను నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మంగళవారం మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా తేల్చింది. ప్రధాన నిందితులైన ఓఎంసీ అప్పటి డైరెక్టర్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి, కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్, గాలి జనార్దనరెడ్డి పీఏ మెహఫూజ్ అలీఖాన్లను దోషులుగా నిర్ధారిస్తూ.. ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున,ఓఎంసీకి రూ.2 లక్షల జరిమానా విధించింది. రాజగోపాల్కు అవినీతి నిరోధక చట్టం కింద అదనంగా నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి ఐఏఎస్ అధికారి యర్రా శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు 2022లో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 2009లో కేసు నమోదు ఏపీ–కర్ణాటక సరిహద్దు అనంతపురం, బళ్లారి రిజర్వు ఫారెస్టులో ఓబుళాపురం గ్రామ పరిధిలోని ఇనుప గనుల తవ్వకాలను ఓఎంసీ నిర్వహించేంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టిందని 2009 డిసెంబరు 7న సీబీఐకి ఫిర్యాదు అందింది. అనుమతి పొందిన 68.5 హెక్టార్ల ప్రాంతాన్ని దాటి ఇనుప ఖనిజాన్ని తవి్వందని అందులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్రెడ్డి, వీడీ రాజగోపాల్, ఓఎంసీ, కృపానందం, సబితాఇంద్రారెడ్డి, గనుల శాఖ నాటి ఏడీ లింగారెడ్డి, శ్రీలక్ష్మిలపై అభియోగాలు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లతో పాటు కొందరిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు పెట్టింది. రూ.884.13 కోట్ల మేర అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని 2011లో సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. 2014 వరకు ఇలా నాలుగు చార్జిషీట్లు వేసింది. 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేశారని, బినామీ లావాదేవీలు జరిగాయని సీబీఐ పేర్కొంది. కాగా, కేసు విచారణ ఏళ్లకు ఏళ్లు పడుతుండడంతో సుప్రీంకోర్టు విచారణను పర్యవేక్షిస్తూ.. మే నెలలోగా పూర్తి చేయాలని గడువు విధించింది. ఇక 219 మంది సాక్షులను విచారించి, 3,330 డాక్యుమెంట్లను పరిశీలించిన సీబీఐ న్యాయస్థానం గత నెలలో తీర్పు రిజర్వు చేసింది. కాగా, లింగారెడ్డి విచారణ దశలోనే మృతి చెందారు. కోర్టుకు హాజరైన నిందితులు తీర్పు వెల్లడి సందర్భంగా కేసులో నిందితులు కోర్టుకు హాజరయ్యారు. ఈ నెల 18న తన కుమారుడి పెళ్లి ఉందని అప్పటివరకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని శ్రీనివాసరెడ్డి కోరారు. తాను ఎన్నో ప్రజాపయోగ కార్యక్రమాలు చేశానని, పేద కుటుంబం నుంచి వచ్చి వేలాదిమందికి ఉపాధి కల్పించానని గాలి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. కోర్టు తనను బళ్లారిలో అడుగుపెట్టొద్దని ఆదేశించినా, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచానని తెలిపారు. ఉపశమనం కల్పిస్తే ఆధ్యాత్మిక పథంలో వెళ్తానని విన్నవించారు. ప్రభుత్య ఉద్యోగులందరినీ వదిలేసి తనను శిక్షించడం అన్యాయమని రాజగోపాల్ నివేదించారు. తనపై ఆధారపడి తల్లిదండ్రులు, నలుగురు పిల్లలు ఉన్నారని అలీ విజ్ఞప్తి చేశారు. సబితాఇంద్రారెడ్డి, కృపానందం కూడా కోర్టుకు హాజరయ్యారు. -
ఓబులాపురం మైనింగ్ కేసులో ఏడుగురికి శిక్ష ఖరారు
సాక్షి,హైదరాబాద్: అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఏడుగురికి శిక్ష ఖరారు చేసింది. ఇద్దరికి శిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఐఏఎస్ కృపానందంలకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వచ్చిన ఓబుళాపురం మైనింగ్ కేసులో మంగళవారం సీబీఐ తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఇద్దరిని నిర్ధోషులుగా ప్రకటించింది. ఏ1 బీవీ శ్రీనివాస రెడ్డి, ఏ2: గాలి జనార్ధన్ రెడ్డి, ఏ3 వీడీ రాజగోపాల్, ఏ4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, A7 అలీ ఖాన్కు సీబీఐ కోర్టు శిక్ష విధించింది. ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 409, 468, 471లతోపాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (2) రెడ్ విత్ 13 (1)(డి) కింద అభియోగాలు నమోదు చేసింది. ఇక ఈ కేసులో విచారణ సాగుతున్న సమయంలోనే A5రావు లింగారెడ్డి మృతి చెందారు. ఏ6 మాజీ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేసింది. కేసులో గాలి సోదరుడు, బీవీ శ్రీనివాస్ రెడ్డికి ఏడేళ్లు శిక్ష విధించింది. -
OMC Case: ఒబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్చిట్
సాక్షి, హైదరాబాద్: ఓఎంసీ(ఒబులాపురం మైనింగ్) కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్చిట్ ఇచ్చింది తెలంగాణ హైకోర్ట్. ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్చిట్ ఇస్తూ మంగళవారం హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను కోర్టు కొట్టివేసింది. కాగా, ఈ కేసులో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలులో ఉన్నారు. ఇక, 2004-09 వరకు శ్రీలక్ష్మి మైనింగ్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి సీబీఐ.. ఆమెపై నేరారోపణకు సంబంధించిన సరైన వివరాలను కోర్టుకు అందించలేకపోయింది. కేవలం ఆరోపణలు మాత్రమే ఉండటంతో కోర్టు ఆమెకు క్లీన్చిట్ ఇచ్చింది. -
ఏది నిజం?: ఇంకెన్నాళ్లీ గలీజు రాతలు?
ప్రతి రోజూ కొంత విషం!. ఒకో రోజు కాస్త ఎక్కువ డోసు!!. మొత్తానికి ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి... అసత్యాలు, అతిశయోక్తులతోనైనా జనంలో ఎంతోకొంత వై.ఎస్.జగన్ సర్కారుపై వ్యతిరేకత నింపాలన్నదే రామోజీరావు అత్యాశ. ఆ మేరకు తన ఆత్మబంధువు చంద్రబాబు నాయుడిని కొంతైనా పైకి లేపాలన్నది ఆయన పరమోద్దేశం. అందుకే ‘ఈనాడు’లో ఏ కథనం రాసినా దాని దృష్టి వేరు.. ప్రయోజనాలు వేరు. బయటకు ప్రభుత్వాన్ని ఎండగడుతున్నట్లు కనిపిస్తున్నా... అడుగడుగునా వక్రీకరణలే. టార్గెట్ జగన్ మాదిరిగా సాగిపోవాల్సిందే. మంగళవారం వండివార్చిన ‘ఓబుళాపురం మైనింగ్ లీజుల్లో అక్రమాలు’ కూడా అంతే!!. 2009లోనే మైనింగ్ ఆగిపోయిన ఈ గనుల గురించి అసలిప్పుడెందుకు రాసినట్లు? అక్కడ గతంలో జరిగిన అక్రమాలపై తాజాగా అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చారని... ఇదంతా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసిన నేపథ్యంలోనే జరిగిందంటూ బోడిగుండుకు– అరికాలుకు లింకు పెడుతూ రాసి పారేశారు రామోజీ. ఏ కాస్త ఇంగితజ్ఞానం... తన వృత్తిపట్ల కనీస జవాబుదారీతనం ఉన్నవారెవరూ ఇలాంటి రాతలు రాయరు గాక రాయరు. పచ్చి అబద్ధాలను అచ్చేయరు. ఓబుళాపురం గనుల విషయంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందో, వాస్తవంగా ఏం జరుగుతోందో... ‘ఈనాడు’ ఎలా భ్రష్టు పట్టించాలని చూస్తోందో చెప్పేదే ఈ ‘ఏది నిజం?’ ఓబుళాపురం గనుల్లో ఇనుప ఖనిజం తవ్వకాల్లో గతంలో చెలరేగిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే అక్కడ అత్యంత పారదర్శకంగా మైనింగ్ కార్యకలాపాలు జరిపించడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వమే మైనింగ్ చేస్తే ఏ గొడవా ఉండదన్న ఉద్దేశంతో... ఏపీఎండీసీకి ఆ లీజులను రిజర్వు చేయించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం కేంద్ర గనుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పంపగా.. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సైతం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఏపీఎండీసీ ద్వారా ఇనుప ఖనిజాన్ని వెలికితీసి, దాన్ని కడప ఉక్కు ఫ్యాక్టరీకి ముడి ఖనిజంగా రవాణా చేయడం ద్వారా ప్రభుత్వ రంగంలోని సంస్థలను ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నారు. రెండురోజుల కిందట కూడా ప్రధానిని కలిసినపుడు కడప ఉక్కు ఫ్యాక్టరీకి గనులను కేటాయించాలని కోరారంటే ఆయన చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు రావటంతో పాటు ప్రభుత్వానికి ఆదాయమూ పెరుగుతుందని... అనేక ఆరోపణలున్న ఇనుప ఖనిజం లీజుల్లో ఎటువంటి విమర్శలకు తావు లేకుండా, పారదర్శకంగా మైనింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. ‘ఈనాడు’ రామోజీరావు మాత్రం అసలు ఈ గనులే తెరుచుకోకూడదన్న ఏకైక లక్ష్యంతో ఎప్పటికప్పుడు బురద కథనాలను అచ్చేస్తున్నారు. అదీ తేడా!. పరిమితి ముగిసిన లీజులను ఏపీఎండీసీకి ఇవ్వాలనడం తప్పా? ఓబుళాపురం ప్రాంతంలో 6 ఐరన్ ఓర్ లీజులను 1956 నుంచి 2007 వరకు వివిధ దశల్లో అప్పటి ప్రభుత్వాలు మంజూరు చేశాయి. ఆరోపణలు రావటంతో 2009లో అప్పటి ప్రభుత్వం ఈ లీజులన్నిటినీ సస్పెండ్ చేసింది. బళ్ళారి ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 27.12 హెక్టార్లలో 1956లో, ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 25.98 హెక్టార్లలో 1964లో, అనంతపురం మైనింగ్ కంపెనీకి 6.5 హెక్టార్లలో 1956లో లీజులు మంజూరు చేశారు. వీటి గడువు 2020 మార్చి 31తో ముగిసిపోయింది. లీజు ముగిసిన వెంటనే ఈ గనులను ఏపీఎండీసీకి రిజర్వు చేయాలని కోరుతూ 09.10.2019నే కేంద్ర గనుల శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇదే విషయమై 2022 జనవరి 3న ప్రధాని మోదీకి రాసిన లేఖలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ అభ్యర్థించారు కూడా. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 3న ఈ 3 లీజులను ఏపీఎండీసీకి ఇవ్వాలని కేంద్ర గనుల శాఖ కార్యదర్శికి రాష్ట్రం తరఫున మరోసారి లేఖ రాశారు. ఈ వాస్తవాల్లో ఒక్కటి కూడా ఎన్నడూ ప్రస్తావించని ‘ఈనాడు’... పదేపదే ఈ లీజులను కావాల్సిన వారికి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచార ఎజెండాను కొనసాగిస్తోంది. సుప్రీంలో కేసు... అంతిమ తీర్పును బట్టే ఏదైనా! ఓబుళాపురం గనులకు సంబంధించి గతంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన కేసులపై సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ సమయంలోనే... కాలపరిమితి ముగిసిన మూడు ఇనుప ఖనిజం లీజులను... అన్ని అర్హతలూ ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం లీజులు జారీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తాజాగా ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. ఇప్పటికే ఈ ప్రాంత గనులకు సంబంధించి అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం కోర్టు విచారణలో ఉంది. సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్ధేశించిన మేరకు ఓబుళాపురం సరిహద్దులను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వే రాళ్ళను కూడా ఏర్పాటు చేసింది. అదే విషయాన్ని కోర్టుకు తెలియజేసింది. సరిహద్దుల నిర్ధారణ పూర్తయిందని, అన్ని అర్హతలూ ఉన్నవారికి కేంద్ర నిబంధనల ప్రకారం లీజులు జారీ చేయటానికి తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో కోర్టులో ఉన్న కేసును పరిష్కరించడం కోసం త్వరగా వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం అడ్వోకేట్ ఆన్ రికార్డ్స్ను అభ్యర్థించింది. ఇదేమైనా తప్పా? ఈ వివాదం పరిష్కారమైతే మూడు గనులకూ లీజులు జారీ అవుతాయి. దాంతో రాష్ట్రానికి కొంత రాయల్టీ.. కొందరికి ఉద్యోగాలు వస్తాయన్నదే ఏ ప్రభుత్వమైనా భావించేది. ఇదంతా తప్పంటే ఎలా రామోజీరావు గారూ? ఇదీ మిగిలిన 3 లీజుల పరిస్థితి... ఇవి కాకుండా ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 2007 జూన్ 19న 39.48 హెక్టార్లు, 68.50 హెక్టార్లలో రెండు లీజులను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి కాలపరిమితి 2057 జూన్ 18 వరకు ఉంది. వై.మహాబలేశ్వరప్ప అండ్ సన్స్కు 1978 జనవరి 12న 20.240 హెక్టార్లలో మరో లీజు మంజూరు చేశారు. దీని కాలపరిమితి 2028 జనవరి 11 వరకు ఉంది. ఈ మూడు లీజులు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నాయి. గతంలో చంద్రబాబు– రామోజీరావు కలిసి నడిపించిన కిరణ్కుమార్ రెడ్డి హయాంలో ఈ లీజులను సస్పెండ్చేశారు. కంపెనీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కిరణ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా... ఆ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వమేం చేస్తుంది? ఈ 3 లీజులకు సంబంధించి కోర్టు ఇచ్చే తీర్పునకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. నిజానికి ఏ ప్రభుత్వమైనా చేసేది అదే. అంతకన్నా ప్రత్యామ్నాయం కూడా ఉండదు. కానీ రామోజీ మాత్రం ఇంకా కోర్టు తీర్పు రాకముందే శివాలెత్తిపోతున్నారు. సుప్రీంకోర్టు ఇంకా తీర్పు ఇవ్వకుండానే... ప్రభుత్వం ఎవరెవరికో లీజులిచ్చేయడానికి ప్రయత్నిస్తోందంటూ చేతికొచ్చిన రాతలు రాస్తున్నారు. ఇవన్నీ చూస్తే వయసు ప్రభావంతో ఈయన మానసిక స్థితి ఏమైందోనన్న అనుమానం రాకమానదు. అమికస్ క్యూరీ నివేదిక అడ్డం పెట్టుకుని అడ్డగోలు రాతలు విచారణ నేపథ్యంలో... ఓబుళాపురం ప్రాంతంలో గతంలో జరిగిన అక్రమాలపై తాజాగా అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు ఒక నివేదికను సమర్పించారు. కానీ రామోజీ దాన్ని వక్రీకరిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ నేపథ్యంలోనే అమికస్ క్యూరీ తన నివేదికను సమర్పించినట్లు అడ్డగోలు రాతలు రాశారు. ఈ గనులను కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఆయనకు కనిపించటమే లేదు. అదే ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. -
ఏడాదైనా కౌంటర్ వేయరా?
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏడాది గడిచినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుకు ఏడాది గడువు సరిపోలేదా అని ప్రశ్నించింది. మూడు నెలల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని బడంగ్పేట మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి జనవరి 4న ప్రకటించిన రిజర్వేషన్లను సవాల్ చేస్తూ అదే ప్రాంతానికి చెందిన బండారి కొమరేష్ దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం విచారించింది. ఇప్పటికే ఎన్నికలు జరిగి ఏడాది గడిచిందని, రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల నాటికి మారుతాయని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ విచారణార్హం కాదని ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ సంజీవ్కుమార్ నివేదించారు. రెండు పర్యాయాలకు ఒకసారి రిజర్వేషన్లు మారుతాయని మున్సిపల్ శాఖ జారీచేసిన ఉత్తర్వుల్లో ఉందని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ను విచారించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం...ప్రతివాదులు మూడు నెలల్లో కౌంటర్ దాఖలు చేయాలని, దానిపై రెండు నెలల్లో రిప్లై దాఖలు చేయాలని పిటిషనర్కు సూచిస్తూ విచారణను జూన్కు వాయిదా వేసింది. ఓఎంసీ కేసు నుంచి నా పేరు తొలగించండి : శ్రీలక్ష్మి సాక్షి, హైదరాబాద్: అక్రమ మైనింగ్ ఆరోపణలపై ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)పై సీబీఐ నమోదు చేసిన కేసులో తనను అక్రమంగా ఇరికించారని, ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. మైనింగ్ లీజుల మంజూరులో నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరించానని తెలిపారు. ఈ పిటిషన్పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 25కు వాయిదా వేసింది. -
ఓబుళాపురం కేసులో వైఎస్ జగన్ను ఇరికించమన్నారు
సాక్షి, అమరావతి: ఓబుళాపురం మైనింగ్ కేసులో జగన్మోహన్రెడ్డిని అక్రమంగా ఇరికించేలా సీఐబీ అధికారుల వద్ద ఆయన పేరు చెప్పాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆ కేసులో సాక్షి, టీడీపీ రాష్ట్ర నాయకులు చెన్నంశెట్టి శశికుమార్ ఆదివారం సంచలన ఆరోపణ చేశారు. కేసు విచారణలో ఆయన పేరు చెప్పలేదని అప్పటి నుంచి తనపై పార్టీ పెద్దలు కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్టు వినలేదనే ఐదేళ్ల కాలంలో తనకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఆదివారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరిన సందర్భంగా శశికుమార్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీలో 30 ఏళ్ల పాటు పార్టీకి విధేయుడిగా పనిచేస్తే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని తూర్పారబట్టారు. తన అన్న సి.రామచంద్రయ్యను కాదని టీడీపీలో కొనసాగినా గుర్తించలేదన్నారు. పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తే తనను కనీసం గుర్తించలేదన్నారు. అందుకే తాను బీజేపీలో చేరాల్సి వచ్చిందని వివరించారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోక పోతే ఏపీలో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఇప్పటికే చాలా మంది పార్టీని వీడే యోచనలో ఉన్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పెద్దలు కేవలం వారి సామాజిక వర్గానికి పదవులు కట్టబెడుతూ, రాజకీయాల్లో కనీస అవగాహన లేని లోకేష్కు మంత్రి పదవి ఇచ్చి పార్టీలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పనిచేసిన కార్యకర్తలను, నేతలను విస్మరించారని దుయ్యబట్టారు. -
బెయిల్ డీల్ కేసు విచారణ 13కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితుడు గాలి జనార్ధన్రెడ్డి బెయిల్ కోసం ముడుపులు చెల్లించారంటూ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) నమోదు చేసిన కేసులో నిందితులు గురువారం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్జే) కోర్టులో హాజరయ్యారు. నిందితులంతా రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు నిందితుల్లో మాజీ న్యాయమూర్తులు తల్లూరి పట్టాభిరామారావు, తెలికపల్లి వెంకట చలపతిరావు, రామారావు కుమారుడు తల్లూరి రవిచంద్ర, మధ్యవర్తులుగా వ్యవహరించిన పొండూరి యాదగిరిరావు, తాడిశెట్టి ఆదిత్య ఉన్నారు. నిందితులకు చార్జిషీట్ ప్రతులను అందజేసిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. ఫోక్స్వ్యాగన్ కేసులోనూ...: ఫోక్స్వ్యాగన్ కార్ల తయారీ కంపెనీని ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేయిస్తామం టూ ముడుపులు తీసుకున్న వ్యవహారంపై ఈడీ నమోదు చేసిన కేసు నిందితులు భువన్కుమార్ చతుర్వేది, జోసెఫ్ జార్జ్ గురువారం ఎంఎస్జే కోర్టులో హాజరయ్యారు. రూ.20 వేల చొప్పున 2 పూచీకత్తు బాండ్లను సమర్పించాలన్న కోర్టు.. తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. ఇదే కేసులో నిందితులైన హెల్మత్ షూష్టర్, అశోక్కుమార్ జైన్, జగదీష్ అలగ్రాజా, గాయత్రీ చంద్రవదన్, వశిష్ట వాహన్ సంస్థకు సమన్లు అందకపోవడంతో.. అందజేయాలని కోర్టు ఈడీని ఆదేశించింది. -
గాలి బెయిల్ విచారణ జూలై 3కి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆ కంపెనీ యజమాని, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి బెయిల్ అభ్యర్థనపై విచారణను సుప్రీం కోర్టు జూలై 3కు వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఆర్.కె.అగ్రవాల్తో కూడిన ధర్మాసనం ముందుకు మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా వేసవి సెలవుల అనంతరం జూలై 3న విచారించనున్నట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు.