నా చెల్లెల్ని ఎలా పెళ్లి చేసుకుంటావ్? | Friendship Turns Fatal In Telangana As Love And Money Dispute Leads To Double Murder, More Details Inside | Sakshi
Sakshi News home page

నా చెల్లెల్ని ఎలా పెళ్లి చేసుకుంటావ్?

Jun 24 2026 10:09 AM | Updated on Jun 24 2026 11:43 AM

Friend Over Love Affair With Relative Sister; Marriage

చిన్నశంకరంపేట (మెదక్‌): ప్రేమ వ్యవహారం, ఆర్థిక లావాదేవీలు ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చురేపింది. తొలుత ఒకరి హత్యకు, ఆపై ప్రతీకార హత్యకు దారితీసింది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్‌ను అదే గ్రామానికి చెందిన రాణబోయిన ప్రభాకర్‌ సోమవారం ఆటోతో ఢీకొట్టి, తలపై రాడ్‌తో మోది హత్య చేశాడు. అనంతరం తూప్రాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. 

అయితే కుమారుడి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయిన శ్రీధర్‌ తండ్రి కిషన్‌తోపాటు మరికొందరు తూప్రాన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ప్రభాకర్‌ కోసం మాటువేశారు. ఈ క్రమంలో ప్రభాకర్‌ తండ్రి రాణబోయిన యాదగిరి (55) భోజనం చేసి వస్తున్న క్రమంలో ఆటోలో అపహరించి హతమార్చారు. అనంతరం మృతదేహానికి బండరాయి కట్టి హల్దీ ప్రాజెక్టులో పడేశారు. కేవలం పన్నెండు గంటల్లోనే జంట హత్యలు జరగడం గమనార్హం. అయితే యాదగిరి కిడ్నాప్‌పై హోటల్‌ యజమాని పోలీసులకు సమాచారం అందించడంతో వారు నిందితుల ఫోన్లను ట్రాక్‌ చేసి హల్దీ ప్రాజెక్టు వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు.

చెల్లెలు వరుసయ్యే యువతిని స్నేహితుడు ప్రేమించడంతో..
సూరారం గ్రామానికి చెందిన ప్రభాకర్‌ ఆటోను శ్రీధర్‌ కొంతకాలం అద్దెకు నడిపాడు. ఆ సమయంలో ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో తన ఆటోను రూ. 1.20 లక్షలకు విక్రయించేందుకు ప్రభాకర్‌ ముందుకురాగా శ్రీధర్‌ రూ.70 వేలు చెల్లించాడు. అయితే శ్రీధర్‌కు వరుసకు చెల్లెలు అయిన యువతిని ప్రభాకర్‌ ప్రేమించడం, ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. దీంతో శ్రీధర్‌ ప్రభాకర్‌కు డబ్బులివ్వలేదు. 15 రోజుల క్రితం ఆ యువతిని ప్రభాకర్‌ పెళ్లి చేసుకోవడంతోపాటు శ్రీధర్‌కు ఫోన్‌ చేసి దమ్ముంటే తేల్చుకోవాలని సవాల్‌ విసరడంతో మరో వ్యక్తితో కలిసి శ్రీధర్‌ అతని వద్దకు వెళ్లగా హతమార్చాడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement