
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఏసీబీ మరోసారి నోటీసులుచ్చింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో సోమవారం(జూన్ 16)న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో ఇదివరకే ఓసారి ఆయన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
జనవరి 9వ తేదీన సుమారు ఆరున్నర గంటలపాటు కేటీఆర్ను ఏసీబీ విచారించింది. ఆపై ఈ ఏడాది మే చివరి వారం(28వ తేదీ)లో మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే అమెరికా పర్యటన నేపథ్యంలో ఆయన విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు తెలియజేశారు. దీంతో మరోసారి ఇవాళ మూడోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 10గం. విచారణకు రావాలని ఏసీబీ తన నోటీసుల్లో స్పష్టం చేసింది.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో.. కిందటి ఏడాది డిసెంబర్ 29వ తేదీన ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జనవరి మొదట్లో విచారణకు హాజరయ్యే క్రమంలో అధికారులు అనుమతించకపోవడంతో వెనక్కి వచ్చేశారు. ఆ సమయంలో ఆయన రాతపూర్వక వివరణ ఇచ్చారు. తిరిగి.. 9వ తేదీ విచారణకు హాజరై ఏసీబీ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
