‘సింగరేణి పరిరక్షణ సదస్సు’లో మాజీమంత్రి హరీశ్రావు ధ్వజం
మంచిర్యాలలో రెండు గంటలకుపైగా పవర్పాయింట్ ప్రజెంటేషన్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/రామకృష్ణాపూర్: రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో సింగరేణిని కుంభకోణాల ఖనిగా మార్చారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. బుధవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పరిధి ఎంఎన్ఆర్ గార్డెన్లో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరై రెండు గంటలపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ వచ్చాక ఓబీ టెండర్లలో సైట్ విజిట్ విధానంతో గతంలో మైనస్లో వెళ్లే కాంట్రాక్టులు 13 శాతం అధికంతో సీఎం బామ్మర్ది సృజన్రెడ్డి శోధ కన్సస్ట్రక్షన్కు కాంట్రాక్టు దక్కిందన్నారు. నైనీ బ్లాక్ టెండర్ను రద్దు చేసిన డిప్యూటీ సీఎం, వీటిని ఎందుకు రద్దు చేయరని ప్రశ్నించారు.
‘నిజం కాకపోతే రాజీనామా’
ఆరు నెలలుగా ఇవన్నీ అడుగుతున్నా డిప్యూటీ సీఎం, సీఎం నోరు విప్పడం లేదని హరీశ్రావు దుయ్యబట్టారు. తాను చెప్పేవి నిజం కాకపోతే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. సౌర విద్యుత్కు ఎన్టీపీసీ, హెచ్సీఎల్ ఒక మెగావాట్కు రూ.3 కోట్లు వెచ్చిస్తుంటే, సింగరేణి మాత్రం 67 మెగావాట్లలో ఒక మెగావాట్కు రూ.7 కోట్ల చొప్పున, మరో 107 మెగావాట్లలో రూ.5 కోట్ల చొప్పున అదనంగా రూ.500 కోట్లు కమీషన్ల కోసం చెల్లించారని విమర్శించారు. జైపూర్ పవర్ ప్లాంట్కు కేబినెట్ ఆమోదం, డీపీఆర్ లేకున్నా టెండర్లు పిలిచి అడ్వాన్సులకు కమీషన్ల కోసం పవర్ మేక్ సంస్థకు సుమారు రూ.1500 కోట్లు ఖర్చు చేశారన్నారు.
లేని బొగ్గు ఉన్నట్టు చూపిస్తూ..
కంపెనీ 40 లక్షల టన్నుల బొగ్గుపై ఆదాయ పన్ను, డివిడెంట్లు, సీఎస్సార్, డీఎంఎఫ్టీ, కోల్ సెస్సుల కింద రూ.1600 కోట్లు కట్టారని హరీశ్రావు మండిపడ్డారు. అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి లేకున్నా, 1.81లక్షల టన్నులు, మందమర్రిలో 5.68లక్షల మెట్రిక్ బొగ్గు ఉన్నట్లు, శ్రీరాంపూర్లో 4.64లక్షల టన్నులు ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని అన్నారు. సదస్సు కంటే ముందు హరీశ్రావు శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కోల్మైన్ ఆఫీసర్స్ పీఆచ్చి, పీఆర్సీ అమలుపై చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సదస్సుకు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, పుట్ట మధు తదితరులు హాజరయ్యారు.


