నదిలో మునిగి ఐదుగురు యువకుల దుర్మరణం
అంతా బంధువులే.. వీరిలో ముగ్గురు సోదరులు
హైదరాబాద్కు చెందిన రాజస్తానీ కుటుంబాల్లో విషాదం
నిర్మల్ జిల్లా బాసరలో ఘటన
భైంసా/బాసర/భైంసా టౌన్/చింతల్ (హైదరాబాద్): నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరిలో ఆదివారం ఘోరం జరిగింది. దైవ దర్శనం చేసుకోవడంతో పాటు సరదాగా గడపాలని వచ్చిన హైదరాబాద్కు చెందిన యువకులు నదిలో స్నానం చేస్తూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మూడు కుటుంబాలకు చెందిన వీరంతా బంధువులే అని తెలిసింది.
కాగా ఊహించని విధంగా జరిగిన ఈ దుర్ఘటనతో రోదనలు మిన్నంటాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్లోని బేగంబజార్, చింతల్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల నుంచి, రాజ స్తానీ కుటుంబాలకు చెందిన సుమారు 30 మంది ఆదివారం ఉదయం ఇంటర్ సిటీ రైలులో బాసర చేరుకున్నారు. తొలుత స్నానాలు చేయాలని భావించారు.
ఘాట్ వద్ద నీరు మురికిగా ఉండడంతో బోటు ద్వారా నది మధ్యలోని ఇసుక తిన్నెల వద్దకు వెళ్లారు. అంతా కేరింతలు కొడుతూ సంతోషంగా గడుపుతుండగా, రాథోడ్ రాకేశ్ (20), భరత్ (16), మదన్ (18), వినోద్ (19), రుత్విక్ (22) స్నానానికి నదిలో దిగారు. అయితే అక్కడ నది లోతు అంచనా లేకపోవడం వారి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. కుటుంబీకులు చూస్తుండగానే ఒకరి వెనుక ఒకరు ఐదుగురూ నీట మునిగిపోయారు.
అంతా కేకలు పెట్టడంతో అక్కడే ఉన్న కొందరు స్పందించి కొద్దిసేపటికే రాకేశ్, భరత్, మదన్, రుత్విక్లను ఒడ్డుకు తీసుకొచ్చారు. అప్పటికే వారు చలనం లేని స్థితిలో ఉండగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..వారిని వెంటనే భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నలుగురూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా గంట పాటు గాలించిన తర్వాత వినోద్ మృతదేహం లభించింది.
ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
తొలుత ఆస్పత్రికి తరలించిన నలుగురిలో ఇద్దరు కొన ఊపిరితో ఉన్నారని, ఆస్పత్రి సిబ్బంది సరిగా స్పందించపోవడంతో వారు మరణించారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. వారి రోదనలతో ఆస్పత్రి ఆవరణ మార్మోగిపోయింది. ఈ సందర్భంగా కొద్దిసేపు ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు.
ఫాదర్స్ డే రోజు పుత్రశోకం
ఈ దుర్ఘటనలో మరణించిన రాకేశ్, మదన్, భరత్ ముగ్గురు సోదరులు. ప్రేమ్రామ్, సోను దంపతుల కుమారులు. ఒకేసారి ముగ్గురూ మరణించడంతో భార్యాభర్తలు కుప్పకూలిపోయారు. విషయం తెలిసి హైదరాబాద్ నుంచి వచ్చిన వారు ఆస్పత్రి వద్ద గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. చింతల్ డివిజన్ చంద్రానగర్కు చెందిన ప్రేమ్రామ్ రైస్, కిరాణా హోల్సేల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా తండ్రికి శుభాకాంక్షలు చెప్పిన ముగ్గురు కుమారులు ఇతర బంధువులతో కలిసి బాసర బయలుదేరి వెళ్లారు. నదిలో ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చారు. రాకేశ్ డిగ్రీ చదువుతుండగా, మదన్ ఇటీవల నీట్ పరీక్ష రాసి మంచి ఫలితం సాధించాడని, భరత్ ఎస్సెస్సీలో స్థానిక స్కూల్ టాపర్ అని తెలిసింది.
వీరి సమీప బంధువులు దిల్సుఖ్నగర్ సమీపంలోని శాలివాహననగర్లో నివాసం ఉంటుండగా వారి కుమారుడు రుత్విక్ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. వినోద్ కుటుంబం బేగంబజార్లో ఉంటుందని తెలిసింది. స్థానిక రాజస్తానీలు కొందరు భైంసా ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను ఓదార్చారు.