సాక్షి, నిర్మల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు తమ మనవడు రియాన్ష్కు అక్షరాభ్యాసం చేయించారు.
ఇక, దర్శనం అనంతరం బాసర ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు. బాసర పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లతో పునర్ నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టనుంది. ప్రాచీన ఆలయం కావడం, ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు.
బాసర పర్యటన ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పిప్రి చేరుకోనున్నారు. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పిప్రిలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు.


