Golconda: కోట టు టూంబ్స్‌.. ఆకాశ యానం | First Ever Ropeway in Golconda Fort | Sakshi
Sakshi News home page

Golconda: కోట టు టూంబ్స్‌.. ఆకాశ యానం

Jun 21 2025 10:03 AM | Updated on Jun 21 2025 10:03 AM

First Ever Ropeway in Golconda Fort

రోప్‌వేలో కేబుల్‌ కార్‌ జర్నీ  

ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు  

పర్యాటకులను ఆకట్టుకొనేలా ఏర్పాటు 

1.5 కి.మీ.. రూ.100 కోట్లతో అంచనాలు

సాక్షి, హైదరాబాద్‌: పర్యాటకులను ఆకట్టుకొనే చారిత్రక గోల్కొండ కోట నుంచి టూంబ్స్‌ వరకు రోప్‌వే అందుబాటులోకి రానుంది. ఇందుకోసం హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రణాళికలు రూపొందిస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో  రోప్‌వేలు, స్కైవేలపై విస్తృత అధ్యయనం చేస్తోన్న హెచ్‌ఎండీఏ అనుబంధ సంస్థ హుమ్టా గోల్కొండ కోట నుంచి 1.5 కి.మీ దూరంలో ఉన్న కుతుబ్‌షాహీల సమాధుల వరకు రోప్‌వే నిర్మాణంపై  దృష్టి సారించింది.  

పర్యాటకులతో కిటకిట.. 
ప్రతి రోజు దేశ,విదేశాలకు చెందిన పర్యాటకులు  గోల్కొండ కోటను సందర్శిస్తుంటారు.  అక్కడి నుంచి  రోడ్డుమార్గంలో టూంబ్స్‌ వరకు వెళ్లడం ఇబ్బందికరంగా మారింది.  ఈ క్రమంలో పర్యాటకులు  ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు వైపులా రాకపోకలు సాగించేందుకు రోప్‌వేను ఏర్పాటు చేయడమే ఏకైక పరిష్కారమని అధికారులు  భావిస్తున్నారు. రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా రోప్‌వే ద్వారా కేబుల్‌ కార్లలో ప్రయాణం చేయడం ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా మారనుంది. ప్రస్తుతం  ప్రతి రోజు సుమారు 10 వేల మందికి పైగా ఈ రెండు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. వీరిలో 3 వేల మంది విదేశీ టూరిస్టులు ఉంటారని అంచనా. రోప్‌వే ఏర్పాటు చేస్తే   దేశ విదేశాలకు చెందిన పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే  అవకాశం ఉంటుంది.  

త్వరలో కన్సల్టెన్సీ ..  
రోప్‌వే ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదికను అందజేసేందుకు త్వరలో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్‌లను ఆహ్వానించేందుకు త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనుంది.  

పీపీపీ పద్ధతిలో నిర్మాణం.. 
రోప్‌వేను పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించనున్నారు. 1.5 కిలోమీటర్లకు సుమారు రూ.100 కోట్ల వరకు వ్యయం కానున్నట్లు అంచనా. ప్రస్తుతం గోల్కొండ కోట నుంచి టూంబ్స్‌ వరకు ట్రాఫిక్‌ రద్దీ కారణంగా  రోడ్డు మార్గంలో వెళ్లాలంటే అరగంటకు పైగా సమయం పడుతుంది. రోప్‌వే వల్ల కేబుల్‌ కార్లలో 10 నిమిషాల్లో రాకపోకలు సాగించవచ్చు. పైగా టూరిస్టులకు ఆకాశంలో విహరించిన అనుభూతి కలుగుతుంది. ప్రస్తుత అంచనాల మేరకు రోజుకు 3000 మందికి పైగా రోప్‌వేను వినియోగించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆ సంఖ్య మరింత పెరగవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement