నిన్న రణరంగం.. నేడు నిశ్శబ్దం | Farmers protest against the establishment of an ethanol company | Sakshi
Sakshi News home page

నిన్న రణరంగం.. నేడు నిశ్శబ్దం

Jun 6 2025 1:34 AM | Updated on Jun 6 2025 1:34 AM

Farmers protest against the establishment of an ethanol company

భయం గుప్పిట్లో పెద్ద ధన్వాడ

12 మంది రైతుల అరెస్ట్‌.. 14 రోజుల రిమాండ్‌ 

ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు.. పోలీసుల నిర్భంధం.. ఇరు వర్గాల తోపులాటలతో అట్టుడికిన జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో తాజాగా నిశ్శబ్దం అలుముకుంది. బుధవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పోలీసులు గ్రామంలో నిఘా కట్టుదిట్టం చేశారు. 

ఆందోళనకారులపై డేగకన్ను వేసిన పోలీసులు పెద్ద ధన్వాడతో పాటు పరిసర గ్రామాల్లో మఫ్టీలో సంచరిస్తూ స్థానికుల కదలికలను గమనిస్తున్నారు. దీంతో ఎప్పుడు, ఏం జరుగుతుందోననే భయం ఆయా గ్రామప్రజల్లో నెలకొనగా.. ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఫ్యాక్టరీ పరిసరాలు, గ్రామాల్లోని వీధులు నిర్మానుష్యంగా మారాయి. 

12 మందికి రిమాండ్‌..  
పెద్ద ధన్వాడ శివారులో పచ్చని పొలాల మధ్య గాయత్రి ఇండస్ట్రీస్‌ రెన్యూవబుల్‌ ఫ్యూయల్స్‌ అండ్‌ అలైడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్‌ కంపెనీతో వాయు, జల కాలుష్యం బారిన పడతామని.. ఫ్యాక్టరీకి అనుమతులు రద్దు చేయాలంటూ బుధవారం ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు రాత్రి వరకూ జల్లెడ పట్టారు. ఆందో ళనలో చురుగ్గా పాల్గొన్న 41 మందిని గుర్తించి.. ఆ రాత్రే 12 మందిని అరెస్టు చేసి మానవపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

గురువారం ఉదయం ఆ రైతులను గద్వాల జిల్లా కోర్టులో హాజరుపరచగా.. వారికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. కాగా.. మిగిలిన 29 మంది ఆందోళనకారుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ‘జనంసాక్షి’ పత్రిక ఎడిటర్‌ రహమాన్‌తోపాటు నాగర్‌కర్నూల్‌ జిల్లా సబ్‌ జైలర్‌ నాగరాజుపై కూడా కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మా రింది. 

దాడుల సమయంలో వారు ఘటనా స్థలంలో లేరని.. అయినా వీరి పేరు చేర్చారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. మరో పక్క పెద్ద ధన్వాడ ఘటనకు సంబంధించి న్యాయవాది రామారావు ఇమ్మానేని గురువారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు.  

10 గ్రామాలపై మఫ్టీలో నిఘా.. 
ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న 10 గ్రామాలపై పోలీసులు ప్రత్యేక నజర్‌ వేశారు. పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, నసనూరు, మాన్‌దొడ్డి గ్రామాల్లో నిఘా కట్టుదిట్టం చేశారు. వీటితో పాటు పచ్చర్ల, తుమ్మిళ్ల, పెద్ద తాండ్రపాడుతోపాటు వడ్డేపల్లి మండలం తనగల, అయిజ మండలంలో తాండ్రపాడు, వేణిసోంపురంపైనా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో గ్రామస్తులు, రైతుల కదలికలను తెలుసుకునేందుకు పోలీసులు మఫ్టీలో సంచరిస్తున్నట్లు సమాచారం. 

మరోవైపు పెద్ద ధన్వాడ ఘటనకు సంబంధించి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారినీ పోలీసులు ఉపేక్షించడం లేదు. వ్యతిరేక పోస్టులు పెట్టిన పలువురికి ఫోన్లు చేసి.. పిలిపించుకుని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆయా గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 

ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పుకునేది లేదు.. 
‘మా పచ్చని పొలాలతో పాటు ఆరోగ్యాన్ని దెబ్బతీసే కాలుష్య కారక ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు’అని రైతులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. గురువారం పెద్ద ధన్వాడలోని రైతు వేదిక వద్ద పలువురు గ్రామస్తులు, రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును ఖండించారు. 41 మంది రైతులపై అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. కంపెనీ యాజమాన్యం, బౌన్సర్లు దాడికి దిగినా.. వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని ధ్వజమెత్తారు. 

సీఎం రేవంత్‌రెడ్డి తమ జిల్లా వాసి అయి ఉండి.. పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నా స్పందించకపోవడం శోచనీయమని విచారం వ్యక్తం చేశారు. 41 మంది రైతులపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని ప్రదర్శించారు. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ తరహాలో ఇక్కడ కూడా ఇథనాల్‌ ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement