మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో ప్రాథమిక అక్షర, సంఖ్యా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ) కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేశారు. మంగళవారం డీఈఓ విజయకుమారి సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటో దిగారు. ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో అవగాహన కల్పించేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని డీఈఓ, ఎంఈఓ కార్యాలయాలతోపాటు కాంప్లెక్స్ పాఠశాలల్లోనూ సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రేపు అథ్లెటిక్స్ పోటీలకు
క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: హన్మకొండలో ఈనెల 26, 27 తేదీల్లో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి సౌత్జోన్ అంతర్జిల్లాల అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపికలను ఈనెల 20న నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. అండర్–14, 16, 18, 20 బాలబాలికల విభాగాల్లో ఎంపికలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఒరిజినల్ ఎస్ఎస్సీ మెమో, జనన, కుల ధ్రువపత్రాలతో సి.శ్రీనివాస్కు రిపోర్టు చేయాలని సూచించారు. ఇతర వివరాలకు 9849706360, 9492177535 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
మహిళా, శిశు సంక్షేమమే ముఖ్యం
మహబూబ్నగర్ రూరల్: మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి సీడీపీఓలు, సూపర్వైజర్లతో వెబ్ఎక్స్ సమావేశం నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరు, లబ్ధిదారుల హాజరు, జీరో బెనిఫిషియరీ కేంద్రాల వివరాలను పరిశీలించారు. కేంద్రాలకు ఏ, బీ, సీ గ్రేడింగ్ ఇవ్వాలని సూచించారు. టీహెచ్ఆర్ పంపిణీ, ఎఫ్ఆర్ఎస్, సమ్మాన్ కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వీబీజీ రామ్ కింద చేపట్టిన నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన వసతులను గుర్తించి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ క్రిస్టియానా, డీడబ్ల్యూఓ జరీనాబేగం పాల్గొన్నారు.


