సాగు అంతంతే | Farmers awaiting for light rains in Telangana | Sakshi
Sakshi News home page

సాగు అంతంతే

Jun 24 2025 6:01 AM | Updated on Jun 24 2025 6:01 AM

Farmers awaiting for light rains in Telangana

గత ఏడాదితో పోలిస్తే.. ప్రసుత్తానికి తగ్గిన వివిధ పంటల సాగు 

తేలికపాటి వానల కోసం రైతుల ఎదురుచూపు 

నిరుడు ఈపాటికి 20 లక్షల ఎకరాల్లో పత్తి.. ఇప్పుడు 16 లక్షల్లోపే

మక్క, జొన్న, సోయాబీన్‌ పంటలు కూడా అదే దారిలో... 

వరి కేవలం 33 వేల ఎకరాల్లోనే సాగు

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం సాగు ఇంకా పుంజుకోలేదు. వాస్తవానికి మే నెలలోనే ముందస్తు నైరుతి రుతుపవనాల రాకతో మురిసిపోయిన రైతులు.. అప్పుడు కురిసిన వర్షాలకు పత్తి, మక్కలు, జొన్నలు సాగు చేశారు. ఆపై వరుణుడి జాడ లేకపోవడంతో కొన్నిచోట్ల విత్తనాలు మొలకెత్తక, మరికొన్ని చోట్ల ఎండిపోయాయి. రెండురోజులుగా కురుస్తున్న తేలకపాటి వర్షాలతో రైతులు మళ్లీ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. 

బావులు, బోర్ల కింద చాలా చోట్ల నార్లు పోసి, దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కేవలం 33 వేల ఎకరాల్లో వరి సాగైంది. కాలువలు, చెరువులు, ప్రాజెక్టుల నుంచి సాగునీటి లభ్యత, నీటి విడుదలపై స్పష్టత రాకపోవడం, వర్షాలు కూడా సరిగ్గా లేకపోవడంతో మెజారిటీ చోట్ల దుక్కులు దున్నడం లేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. 

పత్తి, జొన్న, మక్కలు, ఇతర తృణధాన్యాల సాగుతోపాటు కంది, పెసర, సోయాబీన్‌ వంటి పంటల సాగు విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలతోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చింది. ఈ వానాకాలంలో కోటి 35 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు కేవలం 20 లక్షల ఎకరాల్లో లోపే వివిధ పంటలు సాగయ్యాయి. గత ఏడాది ఈ సమయంతో పోలిస్తే...ఆరు లక్షల విస్తీర్ణం తక్కువగా ఉంది.  

– గత సంవత్సరం ఇప్పటి వరకు 21 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, అదిప్పుడు 16 లక్షల ఎకరాలకే పరిమితమైంది. రాష్ట్రంలో ఈసారి 50 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తారని అంచనా వేశారు. వర్షాలు లేకపోవడం వల్లనే పత్తి సాగు విస్తీర్ణం పెరగలేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.  
– పత్తి తర్వాత అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లాతో పాటు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్‌ తదితర జిల్లాల్లో సోయాబీన్‌ 1.25 లక్షల ఎకరాల్లో సాగైంది.  
– మక్కలు సుమారు 50 వేల ఎకరాల్లో సాగు చేయగా, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో ఉంది.  

విత్తనాలు, ఎరువులపై ఆందోళన 
పత్తి విత్తనాలకు సంబంధించి వివిధ శాఖలు చేసిన ఆపరేషన్‌ కొంత విజయవంతమైంది. జిల్లా స్థాయిలో పోలీస్, వ్యవసాయ శాఖ, సీడ్‌ సర్టిఫికేషన్‌ అధికారులు కలిసి నిర్వహించిన జాయింట్‌ ఆపరేషన్‌లో చాలా చోట్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. నిషేధిత బీటీ–3 విత్తనాలను కూడా సీజ్‌ చేశారు. 

అయినా ఇంకా ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాతో పాటు పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, నిజామాబాద్‌ తదితర చోట్ల నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వ్యవసాయ శాఖ పోలీస్‌ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది.  

– ఎరువులకు సంబంధించి రైతుల్లో ఆందోళన మొదలైంది. పత్తితోపాటు వరికి యూరియా, డీఏపీ అవసరం కాగా, యూరియా కేటాయింపులకు తగినట్టుగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయలేదు. జూన్‌ నెలాఖరు వరకు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 3 లక్షల మెట్రిక్‌ టన్నులే వచ్చింది. రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి ఇటీవలే తిరిగి ప్రారంభం కావడంతో సమస్య ఉండదని మార్క్‌ఫెడ్‌ జీఎం విష్ణు ‘సాక్షి’కి తెలిపారు. 

కాగా కేంద్ర ప్రభుత్వం యూరియా 9.8 లక్షల మెట్రిక్‌ టన్నులతోపాటు డీఏపీ కూడా ఒకటిన్నర లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఈ సీజన్‌కు కేటాయించింది. సాగు విస్తీర్ణం పెరగనున్న నేపథ్యంలో యూరియా, డీఏపీ కేటాయింపుల కన్నా ఎక్కువ అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. దొడ్డు యూరియా సరఫరా చేయడం లేదని, సన్న యూరియాతో ఇబ్బందులు ఉన్నట్టు రైతులు వాపోతున్నారు.  

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు భారీగా పెంచారు  
కేంద్ర ప్రభుత్వం కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు భారీగా పెంచింది. పంటల సాగు మొదలు పెట్టాలనుకుంటున్న రైతులకు యూరియా కొరత సమస్యగా మారింది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచితే బాగుంటుంది.  
– కాలసాని నరసింహారెడ్డి, జమాండ్లపల్లి 

దొడ్డు యూరియా సరఫరా చేయాలి 
సహకార సంఘాల్లో మొత్తం దుమ్ముతో కూడిన సన్నపు యూరియానే సరఫరా చేస్తున్నారు. పొలాల్లో చల్లడానికి ఇది ఏమాత్రం అణువుగా ఉండదు. చల్లడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది. రైతులకు అనువుగా ఉండే దొడ్డు యూరియాను సరిపడా సకాలంలో సరఫరా చేస్తే బాగుంటుంది. 
–నోముల తిరుపతిరెడ్డి, నల్లవెల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement