సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి బాగోతం వెలుగులోకి వచ్చింది. సీఐఎస్ఎఫ్ దుస్తులు వేసుకొని తాను సీఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నానంటూ శ్రీకాకుళానికి చెందిన బాలకృష్ణ బురిడీ కొట్టిస్తున్నాడు. ఇప్పటివరకు 67 మంది మహిళలను పెళ్లిళ్ల పేరుతో మోసం చేసిన బాలకృష్ణ.. మ్యాట్రిమొనీ డాట్కామ్లో పోలీస్ అధికారుల వేషంతో యువతులకు వల వేసి మోసం చేస్తున్నాడు.
కొన్ని రోజులుగా సీఐఎస్ఎఫ్ యూనిఫాం ధరించి ఎయిర్పోర్ట్లో హల్చల్ చేస్తోన్న శ్రీకాకుళానికి చెందిన బాలకృష్ణను అధికారులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్త చేస్తున్నారు.
కాగా, డబ్బుల కోసం పెళ్లి చేసుకొని మహిళలను మోసం చేస్తోన్న నిత్య పెళ్లికొడుకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గత ఏడాది(2025) నవంబర్లో కూడా ఓ నిత్య పెళ్లి కొడుకుని భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీలోని కడప పట్టణానికి చెందిన సోమవరపు సురేంద్ర తనకు మైనింగ్, పెట్రోల్బంక్, కన్సల్టెన్సీలు ఉన్నాయని చెబుతూ పలువురు మహిళలను నమ్మించి వివాహం చేసుకున్నాడు. క్రిస్టియన్ మ్యాట్రిమోనీ ద్వారా ఓ మహిళకు పరిచయమయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకొని ఆమె వద్ద నుంచి రూ.15లక్షలు, 30 తులాల బంగారు నగలు తీసుకొని మోసం చేశాడు.
అంతకు ముందు మరో మహిళను వివాహం చేసుకొని ఆమె నుంచి రూ.12 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.7లక్షలు ఇచ్చి ఆమెతో రాజీ చేసుకున్నారు. దాంతో పాటు మధ్యవర్తి జూపల్లి కిరణ్కుమార్ ద్వారా మరో మహిళ శైలజ వద్ద నుంచి పెళ్లి పేరుతో రూ.2.50 లక్షలు తీసుకొని మోసం చేశాడు. విజయవాడకు చెందిన రత్నకుమారిని కూడా పెళ్లి చేసుకొని రూ.2 లక్షలు ఇచ్చి వదిలించుకున్నాడు. నిందితుడు కరీంనగర్కు చెందిన మహిళను 2017లో వివాహం చేసుకొని 2020లో ఆమెకు విడాకులు ఇచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.


