
2019–20లో 46.5% సేల్స్ ఈ విభాగం నుంచే
2023–24లో 27.7%కి దిగొచ్చిన వాటా
సామాన్యుడికి భారంగా మారిన ధరలు
భారీగా తగ్గిన ఎంట్రీ లెవెల్ కార్ల విక్రయాలు
ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న మారుతీ సుజుకీ
చిన్న కారు.. చిన్నబోతోందా? అవుననే అంటున్నాయి గణాంకాలు. భారతీయ ప్యాసింజర్ కార్ల రంగాన్ని పరుగెత్తించడంలో ఒకప్పుడు కీలక ‘ఇంజిన్ ’గా నిలిచిన చిన్న కార్ల అమ్మకాల్లో వేగం ఏటా తగ్గుతూ వస్తోంది. వీటి ఖరీదు ఏటా పెరుగుతూ వస్తుండడమే ఇందుకు కారణం.
2019–20లో ప్యాసింజర్ వాహన అమ్మకాలలో 46.5%గా ఉన్న చిన్న కార్ల వాటా 2023–24 నాటికి 27.7%కి వచ్చి చేరిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొనసాగుతున్న ఈ క్షీణతపై దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. భారత వాహన పరిశ్రమకు పునాదిగా గతంలో నిలిచిన ఈ విభాగంలో డిమాండ్ను తిరిగి రేకెత్తించడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని పిలుపునిచ్చింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
అంతవరకు ద్విచక్ర వాహనంతో తన కుటుంబాన్ని తీసుకెళ్లిన ఒక సామాన్యుడు.. చిన్న కారు కొనుక్కొని దాంట్లో తన కుటుంబాన్ని షికారుకో, ఊరికో వెళ్లడం ఒక ప్రెస్టీజ్గా భావించేవాడు. ధరలు కూడా తక్కువగా ఉండటంతో అప్పో సప్పో చేసి కారు కొనేసేవాడు. 5 ఏళ్ల కిందటి వరకు చిన్నకార్ల అమ్మకాలు ఇలాగే పెరిగాయి. కానీ, గత 5 ఏళ్లలో అనేక కారణాల వల్ల ధరలు పెరగడంతో చిన్న కార్ల అమ్మకాలకు పెద్ద బ్రేకే పడింది.
భారీగా తగ్గిన చిన్నకార్ల వాటా
దేశంలో 2018–19లో 15,53,598 చిన్నకార్లు అమ్ముడయ్యాయి. 2023–24లో ఈ సంఖ్య 11,68,592కి పడిపోయింది. మొత్తం ప్యాసింజర్ వాహనాల పరంగా చూస్తే.. 2018–19లో 33,77,389 అమ్ముడైతే.. 2023–24లో 42,18,746 వాహనాల అమ్మకాలు జరిగాయి. మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో చిన్న కార్ల వాటా 46 నుంచి 27.7 శాతానికి తగ్గిపోయింది. ఇందులోనూ ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలు భారీగా క్షీణిస్తున్నాయి.
భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) లెక్కల ప్రకారం 2018–19లో ఎంట్రీ లెవల్ కార్లు (3.6 మీటర్ల వరకు పొడవు ఉండేవి) అన్ని కంపెనీలవి కలిపి దేశీయంగా 4,60,772 రోడ్డెక్కాయి. 2024–25లో ఈ సంఖ్య 1,33,397కు పడిపోయింది. భారత్లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ, ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న మారుతీ సుజుకీ కూడా అమ్మకాలు తగ్గినట్టు వెల్లడించింది. 2025 మే నెలలో ఆల్టో, ఎస్–ప్రెస్సో అమ్మకాలు.. గతేడాదితో పోలిస్తే 9,902 నుంచి 6,776 యూనిట్లకు పడిపోయాయి.
క్రమంగా కనుమరుగు..
చిన్న కార్ల అమ్మకాలను పునరుద్ధరించడానికి ప్రభుత్వ జోక్యం చాలా కీలకం. ద్విచక్ర వాహనాల నుంచి నాలుగు చక్రాల వాహనాలకు మారాలనుకునే మొదటిసారి కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు, పన్ను ప్రయోజనాలు ఇవ్వడం ద్వారా అమ్మకాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. కార్ల కొనుగోలు సమయంలో మూడు సంవత్సరాల థర్డ్–పార్టీ బీమా ఇప్పుడు తప్పనిసరి.
పెద్ద కార్ల కొనుగోలుదారులకు ఇది భారం కాదు. కానీ, మొదటిసారి చిన్న కారు కొనే బడ్జెట్ కస్టమర్లను ఈ మొత్తం ఇబ్బంది పెడుతుంది. నియంత్రణ సంబంధ ప్రమాణాలను పాటిస్తూనే పోటీ ధరలను అందించడానికి, అమ్మకాల పరిమాణాన్ని పెంచడానికి వాహన తయారీ సంస్థలు కొత్త ఆవిష్కరణలు చేయాలని నిపుణులు అంటున్నారు.
డిమాండ్ పెరిగేనా?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ–లెవల్ కార్లకు డిమాండ్ పెరుగుతుందని పరిశ్రమ ఆశిస్తోంది. సంవత్సరానికి రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయిస్తూ ఇటీవల బడ్జెట్లో చేసిన ప్రతిపాదన కారణంగా ఈ ఆదాయ వర్గాలు ఎక్కువగా ఖర్చు చేస్తాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. అంతేకాకుండా ఫిబ్రవరి, ఏప్రిల్, తాజాగా ఈ నెలలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించింది. తద్వారా లోన్లపై వడ్డీ భారం ఆ మేరకు తగ్గడం కస్టమర్లకు కలిసి వచ్చే అంశం.
అయితే కొత్త మోడళ్లు భారం అని భావించే ఎంట్రీ లెవల్ కొనుగోలుదారులు పాత కార్లను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు కొత్త మారుతీ ఆల్టో కే10 బేసిక్ వేరియంట్ ధర హైదరాబాద్ ఎక్స్షోరూమ్లో 2019లో సుమారు రూ.3.4 లక్షలు. 2025లో ఇది రూ.4.23 లక్షలకు చేరింది. అంటే ధర 25% పెరిగిందన్నమాట. కొత్త సబ్ కాంపాక్ట్ మోడళ్లకు వెచ్చించే ధరలో పెద్ద, మరిన్ని ఫీచర్లు కలిగిన పాత కార్లు ఇప్పుడు లభిస్తున్నాయి.
జపాన్ ను అనుసరిస్తే..
భారత్లో 1,000లో కేవలం 34 మంది వద్ద మాత్రమే ప్రస్తుతం కార్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్ల అమ్మకాలు పెంచేందుకు.. కొనుగోలుదారులు ద్విచక్ర వాహనాల నుంచి కార్లకు అప్గ్రేడ్ అయ్యే విషయంలో ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాలను భారత ప్రభుత్వం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కొనుగోలుదారులు కార్లకు అప్గ్రేడ్ అవ్వడానికి జపాన్ లో ‘కేయ్’ కార్లు సహాయపడ్డాయి.
పెద్ద కార్లతో పోలిస్తే జపనీస్ కొనుగోలుదారులు కేయ్ మోడళ్లపై తక్కువ పన్ను, బీమా చెల్లిస్తున్నారు. దీనివల్ల యాజమాన్య ఖర్చులు తగ్గుతాయి. జపాన్ లో అమ్ముడవుతున్న అన్ని కార్లలో కేయ్ మూడవ వంతు కలిగి ఉన్నాయంటే మార్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొనుగోలు సవాళ్లను పరిష్కరించడానికి చిన్న, పెద్ద కార్లను ప్రభుత్వం వేర్వేరుగా పరిగణించాలని నిపుణులు అంటున్నారు.
‘భారత్లో కార్ల కొనుగోళ్లు ఎక్కువగా రూ.12 లక్షలకుపైగా వార్షిక ఆదాయం ఉన్న 12% కుటుంబాలకే పరిమితం అయ్యాయి. మిగిలిన 88% మంది కుటుంబాలు చిన్న కారును కూడా సొంతం చేసుకోలేని స్థితిలో ఉన్నాయి’ అని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.