నేడే మున్సి‘పోల్‌’ | Election Commission completed all arrangements for Municipal elections | Sakshi
Sakshi News home page

నేడే మున్సి‘పోల్‌’

Feb 11 2026 1:50 AM | Updated on Feb 11 2026 1:50 AM

Election Commission completed all arrangements for Municipal elections

సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాల డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి పోలింగ్‌ సామగ్రి తీసుకెళ్తున్న సిబ్బంది

116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరగనున్న ఎన్నికలు

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌  

52.17 లక్షల మంది ఓటర్లు.. 2,981 వార్డులు, 12,944 అభ్యర్థులు

8,191 పోలింగ్‌ కేంద్రాలు.. 100% కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌

ఫిర్యాదుల స్వీకరణకు 9240021456 టోల్‌ ఫ్రీ నంబర్‌

పోలింగ్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు నేడు సెలవు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్‌ కార్పొరేషన్లకు బుధవారం జరగనున్న ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరి«ధిలోని 8,191 పోలింగ్‌ కేంద్రాల్లో 52.17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. 2,981 వార్డులు, డివిజన్లకు గాను 12,944 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీతో పాటు సీపీఐ, సీపీఎం, ఆప్, ఎంఐఎం, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తదితర పార్టీలు, స్వతంత్రులు బరిలో నిలిచారు. కాగా మున్సిపాలిటీల్లో 12 మంది కౌన్సిలర్లు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఇద్దరు కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మక్తల్‌ మున్సిపాలిటీలోని ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప మరణంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది.  

సిబ్బంది రెడీ.. 
బుధవారం పోలింగ్‌ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ సామగ్రితో సహా మంగళవారం సాయంత్రానికే తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. 123 పురపాలక సంఘాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి పోలింగ్‌ సిబ్బంది బ్యాలెట్‌ బాక్సులతో తరలివెళ్లారు. సాయంత్రం పోలింగ్‌ ముగిసిన తర్వాత అధికారుల పర్యవేక్షణలో బ్యాలెట్‌ బాక్సులను ముందే ఎంపిక చేసిన 137 స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించి భద్రపరుస్తారు. 

నిరంతర పర్యవేక్షణ 
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు తొలిసారిగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ వెబ్‌ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. తద్వారా పోలింగ్‌ కేంద్రాల లోపలా, వెలుపలా పోలింగ్‌ ప్రక్రియను అధికారులు పర్యవేక్షించనున్నారు. డ్రోన్ల ద్వారా పోలింగ్‌ కేంద్రాల పరిసరాల్లో నిఘాను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. 


‘టీ పోల్‌’లో తెలుసుకోండి.. 
రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించిన ‘టీ పోల్‌ మొబైల్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌’లో ఓటర్లు తమ ఫోటో ఓటరు గుర్తింపు కార్డు నంబరు (ఎపిక్‌) సహాయంతో ఓటరు స్లిప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో పాటు పోలింగ్‌ కేంద్రాల వివరాలు తెలుసుకోవచ్చు. టీ పోల్‌ యాప్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోని ఓటర్‌ పోర్టల్‌ నుంచి కూడా ఓటరు స్లిప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పోలింగ్‌ ప్రక్రియపై ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఎన్నికల సంఘం టోల్‌ ఫ్రీ నంబరు 9240021456ను ఏర్పాటు చేసింది. కాగా ఈ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే వారికి వేతనంతో కూడిన సెలవు వర్తింప చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  


‘హోమ్‌ ఓటింగ్‌‘కు అవకాశం ఇవ్వాలి 
గత అసెంబ్లీ పార్లమెంట్‌ ఎన్నికలలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ 80 సంవత్సరాలు పైబడిన వారు కానీ, వయసుతో నిమిత్తం లేకుండా తీవ్రంగా జబ్బు పడి మంచంలో ఉండి పోలింగ్‌ బూత్‌కు రాలేని పరిస్థితి ఉన్న వారు కానీ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా హోమ్‌ ఓటింగ్‌ ప్రొవిజన్‌ను ప్రవేశ పెట్టింది. తద్వారా ఆయా ఓటర్ల ఇళ్లకు పోలింగ్‌ అధికారులు స్వయంగా వెళ్లి ఓటు వేయించుకుని వచ్చే వెసులుబాటు కల్పించింది. అయితే ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లో అటువంటి ప్రొవిజన్‌ లేదని రిటరి్నంగ్‌ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ ప్రొవిజన్‌ను ప్రవేశపెట్టాలి. 
– ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్‌ బండారు రామ్మోహన్‌రావు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement