అడుగంటిన శ్రీశైలం జలాశయం
పశ్చిమ కనుమల నుంచి సాగర్ వరకు తీవ్ర వర్షాభావం
గతేడాది ఇదే సమయానికి బిరబిరా పరుగులు
ఆల్మట్టి నుంచి సాగర్ వరకు అన్ని ప్రాజెక్టులకు సగటున 10 వేల క్యూసెక్కుల వరద
ఈ ఏడాది ఇప్పటి వరకు ఆల్మట్టి ప్రాజెక్టులో చుక్క నీరు కూడా చేరని వైనం
నారాయణపూర్, తుంగభద్ర, శ్రీశైలం, సాగర్కు నామమాత్రపు ప్రవాహం
ప్రభావం చూపిస్తున్న ఎల్నినో వాతావరణ పరిస్థితులు!
కరువు ఛాయలతో తాగు, సాగునీటి అవసరాలకు కష్టం
విద్యుదుత్పత్తితో సాగర్లో ఉన్న నిల్వలు సైతం ఖాళీ
వర్షాలు కురవకపోతే ఆగస్టు తర్వాత గడ్డు పరిస్థితులే
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ తడారిపోయింది. పరీవాహక ప్రాంతాల్లో ఆశించిన వర్షాలు లేకపోవడంతో నీళ్లు లేని ఎడారిని తలపిస్తోంది. గతేడాది సరిగ్గా ఇదే సమయానికి ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ జలాశయం వరకు ప్రాజెక్టులన్నింటికీ సగటున 10 వేల క్యూసెక్కుల వరద ప్రారంభం కాగా, ఎల్నినో ప్రభావంతో.. ఈ ఏడాది అక్కడి నుంచి ఇక్కడి వరకు అలాంటి పరిస్థితే లేకుండా పోయింది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి గతేడాది సరిగ్గా ఇదే సమయానికి 12,134 క్యూసెక్కుల వరద నమోదు కాగా.. ఈ ఏడాది జూన్ 13 ఉదయం 9 గంటల సమయానికి కూడా చుక్క నీరు రాకపోవడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది.
ఆల్మట్టి వెలవెల: ఆల్మట్టి గరిష్ట నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు. గతేడాది ఈ సమయానికే నిల్వలు 64.12 టీఎంసీలకు చేరాయి. అయితే ప్రస్తుతం 22.8 టీఎంసీలే ఉండటం గమనార్హం. కృష్ణమ్మ జన్మస్థానమైన మహారాష్ట్రలోని మహాబళేశ్వర్లో ఉన్న పశ్చిమ కనుమల నుంచి ఆల్మట్టి ప్రాజెక్టు వరకు ఉన్న 518 కి.మీ.ల నిడివిలోని పరీవాహక ప్రాంతం నుంచి ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటివరకు జలాశయానికి చుక్క నీరు రాకపోవడం ఎగువ పరీవాహక ప్రాంతంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు గతేడాది 10,661 క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం కేవలం 1,287 క్యూసెక్కులే వస్తున్నాయి.
కృష్ణా ఉప నది భీమాపై మహారాష్ట్రలో నిర్మించిన ఉజ్జయినీ జలాశయానికి గతేడాది ఇదే సమయానికి 5,884 క్యూసెక్కుల వరద రాగా, ఈ ఏడాది ఇప్పటివరకు చుక్క రాలేదు. కృష్ణా మరో ఉప నది తుంగభద్రపై కర్ణాటకలో ఉన్న తుంగభద్ర జలాశయానికి గతేడాది ఈ సమయానికి 8,269 క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం కేవలం 365 క్యూసెక్కులే వచ్చిచేరుతున్నాయి. ఇక తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు గతేడాది 13,967 క్యూసెక్కుల ప్రవాహం రాగా, ప్రస్తుతం 2,596 క్యూసెక్కులే వస్తుండటం గమనార్హం. జూరాల గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా గతేడాది 8.77 టీఎంసీల నిల్వలుండగా, ప్రస్తుతం 7.48 టీఎంసీల నిల్వలున్నాయి. ప్రస్తుత సీజన్లో ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు 3.1 టీఎంసీల వరద వచ్చి చేరగా, 1,500 క్యూసెక్కులు కాల్వకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం, సాగర్లో కరువు ఛాయలు
తెలుగు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలు తీర్చే ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను కరువు ఛాయలు కమ్మేస్తున్నాయి. పశ్చిమ కనుమలకు 985 కి.మీ.ల దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి గతేడాది ఇదే సమయానికి 12,104 క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం 2,352 క్యూసెక్కులే వస్తున్నాయి. జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, గతేడాది ఈ సమయానికి 56.59 టీఎంసీలకు నిల్వలు చేరితే ప్రస్తుతం 40.87 టీఎంసీలకే పరిమితమయ్యాయి. ప్రస్తుత సీజన్లో శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరిన వరద కేవలం 2.29 టీఎంసీలే కావడం గమనార్హం. ఇక నాగార్జునసాగర్కు గతేడాది ఈ సమయానికి 10,890 క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం 2,987 క్యూసెక్కులే వస్తున్నాయి.
జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా గతేడాది ఈ సమయానికి 136.47 టీఎంసీల నిల్వలుండగా, ప్రస్తుతం 144.58 టీఎంసీలున్నాయి. ఇందులో ప్రస్తుత సీజన్లో వచ్చి చేరింది 6.04 టీఎంసీలే కాగా మిగతా నిల్వలు గతేడాది వాడుకోగా మిగిలిన జలాలే కావడం గమనార్హం. దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 4,734 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 32.8 టీఎంసీలకు చేరాయి. పశ్చిమ కనుమల నుంచి 1,107 కి.మీ.ల దిగువన ఉన్న సాగర్ వరకు నదీ పరీవాహక ప్రాంతంలో తీవ్ర వర్షాభావం నెలకొని ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయినీ జలాశయాలు నిండిన తర్వాతే దిగువన రాష్ట్రంలో ఉన్న జూరాల, శ్రీశైలం, సాగర్కు వరదలు ప్రారంభం కానుండగా, తాజా పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నాయి.
నీళ్లు లేకున్నా విద్యుదుత్పత్తి!
ఎల్నినో ప్రభావంతో వానాకాలం అంతటా వర్షాలు కురవకపోవచ్చని, కొన్ని విడతల వారీగా వర్షాలు కురిసినా ఆ తర్వాత వర్షాభావం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో నాగార్జునసాగర్లో మిగిలి ఉన్న కొద్ది నిల్వలను విద్యుదుత్పత్తి అవసరాలకు తోడిపారేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సాగర్ ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా శనివారం తెలంగాణ జెన్కో 3,601 క్యూసెక్కులు దిగువకు విడుదల చేసింది. సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీ 3,378 క్యూసెక్కులు తరలించుకుంటోంది.
రోజూ సగటున 2 ఎంయూల చొప్పున.. జూన్ 1 నుంచి 12 మధ్యకాలంలో 25.99 ఎంయూల విద్యుత్ను ఉత్పత్తి చేసి కిందికు నీళ్లను విడుదల చేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలను తాగునీటి అవసరాలకు సంరక్షించుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జలాశయాల్లోని నిల్వలు ఆగస్టు వరకు సరిపోతాయని, ఆ తర్వాతా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటే మాత్రం తాగునీటికీ ఇబ్బందిపడక తప్పదని అధికారులు అంటున్నారు.


