కొత్త అధ్యాయానికి నాంది | Deputy CM Bhatti Vikramarka Comments on new EHS | Sakshi
Sakshi News home page

కొత్త అధ్యాయానికి నాంది

Jul 18 2026 4:22 AM | Updated on Jul 18 2026 4:22 AM

Deputy CM Bhatti Vikramarka Comments on new EHS

డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్‌ సంజయ్‌జాజు చేతుల మీదుగా హెల్త్‌కార్డులు అందుకుంటున్న ఉద్యోగ సంఘాల నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్‌రావు

నూతన ఈహెచ్‌ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

886 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉద్యోగులకు నగదు రహిత వైద్యం 

పథకం పరిధిలో 1,816 రకాల వైద్యం, శస్త్రచికిత్సలు 

పదేళ్ల బీఆర్‌ఎస్‌ హయాంలో ఉద్యోగులను పట్టించుకోలేదు

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) నూతన అధ్యాయానికి నాంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 886 ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల ద్వారా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా 8 లక్షల మంది ఉద్యోగులతో పాటు మొత్తంగా 29.80 లక్షల మంది ఉచిత ఇన్‌పేషెంట్ వైద్య సేవలు పొందవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) ప్యాకేజీ రేట్లకు అనుగుణంగా 1,816 రకాల వైద్యం, శస్త్రచికిత్సలు ఈ పథకం పరిధిలోకి వస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక భరోసా, నమ్మకం కలిగిస్తూ, ఎలాంటి భయాందోళనలు లేని ఒక చక్కటి ఆరోగ్య భద్రత వ్యవస్థను అందించాలనేదే సర్కారు ఉద్దేశమన్నారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే బాగా పని చేస్తారని, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతాయని, అన్నారు. శుక్రవారం సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహతో కలిసి కొత్త ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఉద్యోగులకు హెల్త్‌ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

ఉద్యోగులపై ప్రేమ, చిత్తశుద్ధికి నిదర్శనం 
‘ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధికి ఈ పథకమే నిదర్శనం. ఉద్యోగులు కూడా కుటుంబ సభ్యులే. వారి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైనప్పుడు వైద్య ఖర్చుల కోసం అప్పులపాలై, వాటిని తీర్చలేక సతమతమవుతున్న దుస్థితిని గమనించాం. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మానవీయ కోణంతో ఆలోచించి కొత్త ఆరోగ్య పథకాన్ని తీసుకొచ్చింది. అలాగే రాష్ట్రంలో అర్హులైన 1.06 కోట్ల కుటుంబాలకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కార్పొరేట్‌ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నాం. దీని పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. 

రూ.10 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేస్తున్నాం.. 
రాష్ట్ర సాధన కోసం ఉద్యోగులు చేసిన కృషిని మరవలేము. అలాంటి ఉద్యోగుల సమస్యలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. పదేళ్లలో రూ.10 వేల కోట్లు అప్పు చేసింది కానీ ఉద్యోగుల విజ్ఞప్తులను బుట్టదాఖలు చేసింది. గత ప్రభుత్వం బకాయి పెట్టిన దాదాపు రూ.10 వేల కోట్ల బిల్లులను మా ప్రభుత్వం మానవీయ కోణంలో క్లియర్‌ చేస్తోంది. పెండింగ్‌ బిల్లులను నెలకు రూ.2 వేల కోట్ల చొప్పున విడుదల చేస్తున్నాం. ప్రతి 15 రోజులకోసారి నేను స్వయంగా సమీక్షిస్తున్నా..’అని భట్టి చెప్పారు. 
 
20 ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది: మంత్రి దామోదర 
వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ.. 20 ఏళ్ల ఆకాంక్ష ప్రజా ప్రభుత్వంలో నెరవేరిందని చెప్పారు. నగదు రహిత వైద్య సేవలు చరిత్రాత్మక నిర్ణయమన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, ప్రధాన కార్యదర్శి మార జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘ఇదొక శుభదినం’అని అన్నారు. 20 ఏళ్ల కల ఈ రోజు నెరవేరిందన్నారు. ఉద్యోగుల 64 సమస్యల్లో 35 ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement