ఆదిలాబాద్ జిల్లా: డెన్మార్క్కు చెందిన దంపతులు తమ దత్తపుత్రుడి తల్లిదండ్రుల కోసం ఆదిలాబాద్ జిల్లాలో అన్వేషిస్తున్నారు. ఇంద్రవెల్లి మండలం దొడందా పంచాయతీ పరిధిలోని చిలటిగూడ, గట్టెపల్లి పంచాయతీ పరిధిలోని టెకిడిగూడ గ్రామాలను ఆదివారం సందర్శించారు. ఆడాప్టి రైట్స్ కౌన్సిల్ (ఏఆర్సీ) సంస్థ ప్రతినిధి, ముంబయికి చెందిన హైకోర్టు అడ్వొకేట్ అంజలి దత్తత తల్లిదండ్రులు చెప్పిన మాటలను హిందీలో అనువాదం చేసి ఆదివాసీలకు అర్థమయ్యేలా తెలిపారు.
2016లో రెండు నెలల బాలుడిని గుర్తు తెలియని దంపతులు ఆదిలాబాద్ రిమ్స్లో వదిలేసి వెళ్లారని, ఆ బాలుడిని గుర్తించిన శిశు సంక్షేమ శాఖ అధికారులు శిశుగృహలో సంరక్షించినట్లు పేర్కొన్నారు. 2018లో డెన్మార్క్కు చెందిన లూయిస్–రాస్ముస్ దంపతులు చట్టబద్ధంగా ఆ చిన్నారిని దత్తత తీసుకుని అర్జున్గా నామకరణం చేసి సంరక్షిస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం బాలుడి వయస్సు పదేళ్లు. అయితే బాలుడి సొంత తల్లిదండ్రుల జాడ కోసం వారిని ప్రశ్నించడంతో ఆచూకీ కోసం ఆదిలాబాద్కు వచ్చినట్లు దత్తత తల్లిదండ్రులు తెలిపారు. ఈ క్రమంలో పలు గ్రామాల్లో పర్యటిస్తున్నామని వారు పేర్కొన్నారు. బాలుడికి పుట్టుకతో చేతివేళ్లు లేవని తెలిపారు. కన్నవారు గుర్తించి వస్తే వారి పరిస్థితి బట్టి ఆర్థికసాయం కూడా చేస్తామని పేర్కొన్నారు. అలాగే వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని సంస్థ నిర్వాహకురాలు అంజలి తెలిపారు. వారి వెంట సర్పంచ్ పవార్ చాంగోనా, సీడబ్ల్యూసీ సభ్యులు మీర్జా యాకుబ్బేగ్ తదితరులున్నారు.


