● నిరాశపరిచిన నిర్మలమ్మ పద్దు ● జిల్లాకు నిధుల కేటాయింప
ఆదిలాబాద్టౌన్: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లావాసులను ఊరించి.. ఉసూరుమనిపించినట్లు అయింది. జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. వేతన జీవులకు ఆదాయ పన్ను యథాతథంగా అమలు చేస్తామని ప్రకటించడం వారిలో నిరాశ నింపింది. బాలిక వసతిగృహాల మంజూరు ప్రకటన, క్యాన్సర్, మధుమేహ బాధితులు వాడే మందుల ధరలు తగ్గిస్తామని పేర్కొనడం కొంత ఊరటనిచ్చే అంశం. ఎరువులకు సంబంధించి రాయితీ ప్రకటించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రస్తావన రావడం కొంత ఊరట కలిగించే విషయమే. జిల్లాలో అధిక శాతం పత్తి సాగు చేస్తుండడంతో ఇక్కడ టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు చే కూరనుంది. విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రభుత్వపరంగా విద్యా ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది. కళాశాలల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నా రు. డాటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ప్రత్యేకించి ప్రస్తావన లేకపోవడం..
జిల్లాకు సంబంధించిన నిధుల విషయంలో ప్రత్యేకించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో జిల్లా వాసుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి 700 ఎకరాల భూసేకరణ చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీవో సైతం జారీ అయింది. అయితే దీనికి నిధులు విడుదలవుతాయని జిల్లా వాసులు భావించినప్పటికీ నిరాశే మిగిలింది. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్కు మరోసారి మొండి చెయ్యి తప్పలేదు.
వైద్య ఆరోగ్యానికి ప్రాధాన్యం..
ఆరోగ్య రంగానికి మాత్రం పెద్దపీట వేశారు. 17 రకాల ఔషధాలపై పన్నులు తగ్గించడం దీర్ఘకాల వ్యాధులతో బాధపడే రోగులకు భారీ ఉపశమనంగా చెప్పవచ్చు. దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు దివ్యాంజల్ కౌశల్ యోజన పథకానికి నిధులు కేటాయించారు. అలాగే ఆయుర్వేద ఆస్పత్రులను ప్రోత్సహించడంతో జిల్లా వాసులకు మేలు చేకూరనుంది.
రాష్ట్ర హక్కులను హరించేలా ఉంది..
కేంద్ర బడ్జెట్ రాష్ట్ర హక్కులను హరించేలా ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేశారు. రాష్ట్రం నుంచి వాటాగా పన్నులు తీసుకుంటున్న కేంద్రం బడ్జెట్లో ఏ రంగానికి సరైన నిధులు కేటాయించకపోవడం కేంద్ర వివక్షతకు అద్దం పడుతుంది. – డాక్టర్ నరేశ్ జాదవ్, డీసీసీ అధ్యక్షుడు
తెలంగాణకు గుండుసున్నా
తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే కేంద్రం మరోసారి రాష్ట్రానికి కేటాయింపుల్లో గుండుసన్నానే మిగిల్చింది. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకి అనేందుకు ఈ బడ్జెట్ నిదర్శనం. పక్షపాత వైఖరిని అవలంభిస్తున్న ఆ పార్టీ నిజస్వరూపాన్ని ప్రజలు ఇప్పటికై నా గ్రహించాలి. – జోగు రామన్న, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
● నిరాశపరిచిన నిర్మలమ్మ పద్దు ● జిల్లాకు నిధుల కేటాయింప
● నిరాశపరిచిన నిర్మలమ్మ పద్దు ● జిల్లాకు నిధుల కేటాయింప


