Second Wave Of Coronavirus In Telangana: కరోనా.. టెన్షన్‌.. టెన్షన్‌! - Sakshi
Sakshi News home page

కరోనా.. టెన్షన్‌.. టెన్షన్‌! 

Mar 13 2021 5:12 AM | Updated on Mar 13 2021 12:00 PM

Coronavirus Second Wave Danger Bells In Telangana - Sakshi

రాష్ట్రాన్ని సెకండ్‌ వేవ్‌ భయం వెంటాడుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం, వారం, పది రోజులుగా తెలంగాణలోనూ కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని సెకండ్‌ వేవ్‌ భయం వెంటాడుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం, వారం, పది రోజులుగా తెలంగాణలోనూ కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గతేడాది మార్చి 2న తొలి కేసు నమోదు కాగా, ఏప్రిల్, మే నుంచి కరోనా విజృంభించింది. ఆగస్టు, సెప్టెంబర్‌ వరకు రాష్ట్రాన్ని అతలాకు తలం చేసింది. ఇప్పుడూ సరిగ్గా ఏడాది తర్వాత కేసు లు పెరుగుతుండటం గమనార్హం. మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు తీవ్రంగా నమోదు అవుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన పట్టిపీడిస్తోంది. ఆయా రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి నిత్యం రాకపోకలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి అంతర్గత విమానాల నుంచి ప్రయాణికులు వస్తూపోతుం డటం, కాలేజీలు, స్కూళ్లు, సినిమా హాళ్లు, హో టళ్లు తెరిచి ఉండటం, బ్రిటన్‌ స్ట్రెయిన్లు, ఇక్కడి కొత్త స్ట్రెయిన్లు చాపకింద నీరులా విస్తరిస్తుండటంతో సెకండ్‌ వేవ్‌పై అనుమానాలు మొదలయ్యాయి. వ్యాక్సిన్‌ వేస్తున్నా, కేసులు పెరిగితే పరిస్థితేంటన్న ఆందోళన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అన్ని జిల్లాలనూ అప్రమత్తం చేసింది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాల ని ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న వారిపై దృష్టి పెట్టాలని కోరింది. 

రోజూ 50 వేల పరీక్షలు.. 
ఏడాదిలో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. మూడు నాలుగు నెలలుగా పెద్దగా కేసులు నమోదు కాకపోవడంతో ప్రజల్లో కరోనా జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం పెరిగిందన్న భావన వైద్య వర్గాల్లో ఉంది. కరోనా సెకండ్‌ వేవ్‌ అంటే మనం జాగ్రత్తగా లేకపోవడం వల్ల వైరస్‌ విస్తరించడమే తప్ప, ప్రత్యేకంగా వేవ్‌ ఉండదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రోజుకు కనీసం 50 వేల పరీక్షలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలుంటే పరీక్షలు చేసుకోవాలని, యాంటీజెన్‌ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చి, లక్షణాలున్న వారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. 

మెడికల్‌ కాలేజీ భవనాలపై సమీక్ష.. 
మెడికల్‌ కాలేజీల భవన నిర్మాణ పనులను మంత్రి ఈటల సమీక్షించారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకంతో అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బడ్జెట్‌ సమావేశాల కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణ, వైద్య విద్య డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

ఆసుపత్రులను సిద్ధం చేయండి: ఈటల
కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఉన్నతాధికారులు, జిల్లాల వైద్యాధికారులు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలపై సూపరింటెండెంట్లతో చర్చించారు. పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కేసులు పెరిగితే అన్ని ఆసుపత్రుల్లో చికిత్సల కోసం వార్డులను సిద్ధంగా ఉంచాలని కోరారు. కరోనా పరీక్షలు పెంచాలన్నారు. మేడ్చల్‌– మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదారాబాద్, సంగారెడ్డి జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి జరగకుండా చూడాలని కోరారు. వైద్యాధికారులు, ప్రజ లు రిలాక్స్‌ కావొద్దని కోరారు. స్కూళ్ల లో, పరీక్ష కేంద్రాల్లో కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖ అధికారులతో సమన్వయంగా పనిచేయాలని వైద్య, ఆరోగ్య అధికారులను కోరారు. 102, 104, 108 వాహనాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement