డ్రైపోర్టు వస్తే గేమ్‌ ఛేంజరే.. | Container Corporation of India ready to set up inland container depot in Nizamabad | Sakshi
Sakshi News home page

డ్రైపోర్టు వస్తే గేమ్‌ ఛేంజరే..

Jun 6 2025 1:54 AM | Updated on Jun 6 2025 1:54 AM

Container Corporation of India ready to set up inland container depot in Nizamabad

రైతులు ఎగుమతిదారులుగా మారాలంటే నిజామాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిందే

డ్రైపోర్టు ఏర్పాటు చేస్తే ఇక్కడి నుంచే నేరుగా అంతర్జాతీయ ఎగుమతులు

నేరుగా పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్న,సోయా, బియ్యం, మామిడి, పత్తి,కూరగాయల ఎగుమతికి అవకాశం

మరోవైపు రాష్ట్రంలో భారీగా పెరుగుతున్నరైతు ఉత్పత్తిదారుల సంఘాల సంఖ్య 

‘ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపో’ ఏర్పాటుకు సిద్ధంగా కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: భూపరివేష్టిత రాష్ట్రమైన తెలంగాణ చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో తీరప్రాంతం ఉంది. వ్యవసాయంలో ముందంజలో ఉన్న ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, ఆదిలాబాద్‌ జిల్లాలు, సమీప కర్ణాటకలోని బీదర్, మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాల్లో పసుపు, సోయా, మొక్కజొన్న, ఎర్రజొన్న, మామిడి, ధాన్యం, పత్తి, కూరగాయల ఉత్పత్తులు భారీగా ఉంటున్నాయి. 

వీటికి అదనపు విలువ జోడించి అంతర్జాతీయ ఎగుమతులు సైతం చేసే లక్ష్యంతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు భారీగా ఏర్పాటవుతున్నాయి. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటైంది. దీంతో పసుపు సాగు విస్తీర్ణం మరింత పెరగనుంది. అయితే రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న ట్రేడర్లు ముంబై, చెన్నై, విశాఖ ద్వారా ఎగుమతులు చేయాల్సి వస్తోంది. 

వీరంతా కేవలం రోడ్డు మార్గంపైనే ఆధారపడుతుండడంతో భారీ వ్యయం అవుతోంది. రైల్వేకు అనుసంధానంగా డ్రైపోర్టు ఏర్పాటు చేయాలని నిజామాబాద్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ వారు పదేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఇక్కడ డ్రైపోర్టు ఏర్పాటు చేస్తే రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రైతులే వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి ఎగుమతిదారులుగా మారేందుకు సిద్ధంగా ఉన్నారు.

» భారతదేశ తూర్పు, పశ్చిమ తీరానికి మధ్యలో భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో ఉన్న నిజామాబాద్‌ జిల్లా.. మరోవైపు ఉత్తర భారతానికి, దక్షిణ భారతానికి గేట్‌వేలాగా ఉంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ డిమాండ్‌ మేరకు జిల్లాలోని డిచ్‌పల్లి వద్ద ‘ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపో’ (కంటైనర్‌ ఫ్రైట్‌ స్టేషన్‌) ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా మూడున్నరేళ్ల క్రితమే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

రాష్ట్రప్రభుత్వం స్థలం కేటాయించకపోవడంతో పట్టాలెక్క లేదు. నిజామాబాద్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ 2015 సంవత్సరం నుంచి డ్రైపోర్టు కోసం డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ’ సంస్థ జిల్లాలో సర్వే చేసింది. తరువాత ‘ఎగుమతి దిగుమతిదారుల సమాఖ్య’ సంస్థ మరోసారి రీసర్వే చేసింది. నిజామాబాద్‌ ప్రాంతం ‘హై స్ట్రాటజికల్‌ అండ్‌ జియోగ్రాఫికల్‌ లొకేషన్‌’లో ఉందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు నివేదిక ఇచ్చారు. 

‘ఆజాదీ కా అమృత్‌’ మహోత్సవాల్లో భాగంగా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ ఉన్నతాధికారులను కలిశారు. దీంతో కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జీఆర్‌ శేషగిరిరావు 2022 సెప్టెంబర్‌లో 28న నిజామాబాద్‌కు వచ్చి కంటైనర్‌ ఫ్రైట్‌ స్టేషన్‌ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇది ఏర్పాటైతే డ్రైపోర్టుకు మార్గం సుగమం అవుతుంది.

» ఇన్‌ల్యాండ్‌ కంటెయినర్‌ డిపో ఏర్పాటు చేస్తే దేశవిదేశాల ట్రేడర్లతో నేరుగా ఎగుమతి, దిగుమతి వ్యాపారం చేసేందుకు వీలుంటుంది. గిడ్డంగులు కూడా ఏర్పాటవుతాయి. కూరగాయలకు ఇక్కడ ధర లేని సమయంలో రోడ్లపై పారబోయాల్సిన పరిస్థితి తప్పుతుంది. నేరుగా అంతర్జాతీయ ఎగుమతులకు అవకాశం కలిగితే.. ఇక్కడి వ్యాపారులతో పాటు రైతులకు మరింత మేలు కలుగుతుంది. విత్తనాల అవసరం ఎక్కువగా ఉన్న దేశాలకు నేరుగా ఎగుమతులు చేసే అవకాశం ఉంది. 

కోల్డ్‌ స్టోరేజ్‌ లాంటి ఫ్రీజర్‌ కంటైనర్లు అందుబాటులోకి వస్తాయి. ఒక్కొక్క డిపో నుంచి 28 టన్నుల సామర్థ్యం కలిగిన 90 కంటైనర్లు అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఇతర గూడ్స్‌ రైళ్లకు సైతం కంటైనర్లను జోడించే సౌలభ్యం ఉంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపు లేదా లీజుకిస్తే వెంటనే పనులను ప్రారంభిస్తామని కంటైనర్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గతంలోనే తెలపడం గమనార్హం.

ఉపాధి అవకాశాలు మెండు
భౌగోళికంగా ఉత్తర, దక్షిణ భారతానికి గేట్‌వేగా ఉన్న నిజామాబాద్‌ ప్రాంతంలో కంటైనర్‌ ఫ్రైట్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తే వ్యవసాయ అనుబంధ, ఫుడ్‌ ప్రాసెసింగ్, అనుబంధ పరిశ్రమలు ఈ ప్రాంతానికి భారీగా తరలివస్తాయి. దీంతో ఇక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వలసలు తగ్గుతాయి. రవాణా చార్జీలు సైతం తగ్గుతాయి. కంటైనర్‌ డిపో వస్తే ఈ ప్రాంతంలో ఎకానమీ రూ.వెయ్యి కోట్లకు పెరుగుతుంది. 

తరువాత కేంద్రం డ్రైపోర్టు సైతం ఇచ్చేందుకు అవకాశాలు పెరుగుతాయి. ఇక్కడి వ్యాపారులు, రైతులు అంతర్జాతీయ ఎగుమతుల విషయంలో పోటీపడే అవకాశాలు కలుగుతాయి. రోడ్డు రవాణాతో పోలిస్తే రైల్వే ద్వారా రవాణా చార్జీలు భారీగా తగ్గుతాయి. నేరుగా షిప్‌యార్డులకు ఉత్పత్తులు తీసుకెళ్లే అవకాశం ఉండడంతో మరింత చౌకగా అంతర్జాతీయంగా ఇక్కడి నుంచి ఎగుమతులు చేసుకోవచ్చు. -నల్ల దినేష్‌రెడ్డి,మాజీ అధ్యక్షుడు,చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, నిజామాబాద్‌ 

తక్షణమే భూమి కేటాయించాలి
డిచ్‌పల్లి వద్ద డ్రైపోర్టు ఏర్పాటు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం తక్షణమే భూమి కేటాయించాలి. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పసుపు సాగు విస్తీర్ణం పెరగనుంది. డ్రైపోర్టు ఏర్పాటు చేస్తే వ్యవసాయంలో ప్రథమంగా ఉన్న నిజామాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చే పంట ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి నేరుగా అంతర్జాతీయ ఎగుమతులు చేసేందుకు రైతులకు పుష్కలమైన అవకాశాలు దక్కుతాయి. డ్రైపోర్టు వస్తే ఉత్తర తెలంగాణకే గేమ్‌ ఛేంజర్‌ అవుతుంది. -పాట్కూరి తిరుపతిరెడ్డి,చైర్మన్,జేఎంకేపీఎం పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement