మజ్లిస్‌ పార్టీ కంచు కోటను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్‌ వ్యూహం | Congress Political Strategy On MIM Party | Sakshi
Sakshi News home page

మజ్లిస్‌ పార్టీ కంచు కోటను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్‌ వ్యూహం

Nov 2 2023 8:29 AM | Updated on Nov 2 2023 6:24 PM

Congress Political Strategy On MIM Party   - Sakshi

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ మజ్లిస్‌ స్థానాలపై దృష్టి సారించింది. ఆ పార్టీ కంచు కోట అయిన పాతబస్తీలో దెబ్బ తీసేందుకు పావులు కదుపుతోంది. అధికార బీఆర్‌ఎస్‌తో దోస్తీ కట్టి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మైనారిటీ ఓట్లను గండికొట్టే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా హలత్‌–ఏ–హజరా పేరుతో మజ్లిస్‌ సభలకు  శ్రీకారం చుట్డడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే మజ్లిస్‌ తీరుపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్‌ అధిష్టానం ఏకంగా పాతబస్తీపై ప్రత్యేక వ్యూహానికి సిద్ధమైంది.

మజ్లిస్‌ సిట్టింగ్‌ స్థానాల్లో గట్టి పోటీతో ఉక్కిరిబిక్కిరి చేసి అగ్రనేతలు పాతబస్తీ దాటకుండా కట్టడి చేయాలన్నదే కాంగ్రెస్‌ ప్రణాళికగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా అన్ని స్థానాలపై కాకుండా కొన్నింటిపై  మాత్రమే దృష్టి సారించింది. వాస్తవంగా పాతబస్తీలో తలపడేందుకు అధికార పక్షంతో పాటు మిగతా పక్షాలు సైతం మొక్కుబడిగా అభ్యర్థులను బరిలో దింపడం ఆనవాయితీ. అయితే.. ఈసారి  కాంగ్రెస్‌ పార్టీ కూడా చార్మినార్‌ మినహా అభ్యర్థులను ప్రకటించింది.  

మూడింటిపైనే ఆశలు..  
కాంగ్రెస్‌ పార్టీ పాతబస్తీలో పూర్వ వైభవం కోసం మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులను దింపుతోంది. ఇప్పటికే నాంపల్లి, మలక్‌పేట స్థానాలకు అభ్యర్ధులకు ప్రకటించగా. చార్మినార్‌ సెగ్మెంట్‌కు ప్రకటించాల్సి ఉంది.  నాంపల్లి స్థానం నుంచి వరుసగా మూడుసార్లు  మజ్లిస్‌ అభ్యర్థులతో నువ్వా నేనా అనే విధంగా తలపడి పరాజయం పాలైన ఫిరోజ్‌ ఖాన్‌ను ఈసారి కూడా కాంగ్రెస్‌ పార్టీ బరిలో దింపుతోంది. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుతో పాటు సానుభూతి కూడా కలిసి వచ్చి బయటపడే అవకాశం ఉందని భావిస్తోంది. మజ్లిస్‌ కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ను యాకుత్‌పురా స్థానానికి మార్చి జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ మాజీద్‌ హుస్సేన్‌ను బరిలో దింపాలని యోచిస్తోంది. 

 కాంగ్రెస్‌ పార్టీ  చార్మినార్ అసెంబ్లీ స్థానం అభ్యర్థిత్వం ప్రకటించలేదు. పాతబస్తీలో ముస్లిం సామాజిక వర్గంలో గట్టి పట్టు ఉన్న అలీ మస్కతి అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతోంది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సైతం చార్మినార్ స్థానం నుంచి అలీ మస్కతిని పోటీ చేయాలని కోరామని వెల్లడించారు. మరోవైపు మజ్లిస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ ఖాన్‌కు తిరిగి సీటు ఇచ్చేందుకు నిరాకరిస్తుండటంతో ఆయనతో సంప్రదింపులు ప్రారంభించింది. అవసరమైతే కాంగ్రెస్‌ పక్షాన ఆయనను బరిలో దింపాలని ఒక ఆప్షన్‌గా పెట్టుకొని వేచి చూస్తోంది.  

మలక్‌పేట స్థానంపై సైతం గట్టి పోటీకి సిద్ధమైంది. అక్కడి నుంచి స్థిరాస్తి వ్యాపారి షేక్‌ అక్బర్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మరోవైపు అక్కడి నుంచి గతంలో టీడీపీ నుంచి రెండు పర్యాయాలు పోటీ చేసి మజ్లిస్‌కు గట్టి పోటి ఇచి్చన మాజీ కార్పొరేటర్‌ ముజఫర్‌ అలీ ఖాన్‌ని పారీ్టలో చేర్చుకుంది. కాంగ్రెస్‌ పక్షాన ఒకసారి పోటీ చేసి పారీ్టకి దూరమైన మందడి విజయ సింహారెడ్డిని సైతం పార్టీ కండువా కప్పింది.  చాప కింద నీరులా పాగా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారానికి పార్టీ జాతీయ మైనారిటీ నేతలను సైతం రంగంలో దింపాలని యోచిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement