అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు | Cm Revanthreddy Responds On Sandhya Theatre Pushpa Incident | Sakshi
Sakshi News home page

సంధ్య థియేటర్‌ ఘటన..అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

Dec 21 2024 2:54 PM | Updated on Dec 21 2024 4:06 PM

Cm Revanthreddy Responds On Sandhya Theatre Pushpa Incident

సాక్షి,హైదరాబాద్‌:సంధ్య థియేటర్‌ ఘటనపై విచారణ జరుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో శనివారం(డిసెంబర్‌ 21) రేవంత్‌రెడ్డి ఈ విషయమై మాట్లాడారు. హీరో అల్లుఅర్జున్‌ సంథ్య థియేటర్‌కు రావడానికి 2వ తేదీన దరఖాస్తు చేసుకుంటే 3వ తేదీ పోలీసులు తిరస్కరించారు. 

అయినా కూడా అల్లు అర్జున్‌ థియేటర్‌కు 4వ తేదీ వచ్చారు. థియేటర్‌కు ఒకటే మార్గం ఉంది భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పారు. వేల సంఖ్యలో అభిమానులు రావడంతో పరిస్థితి చేయిదాటింది. సినీహీరో కావడంతో ఒక్కసారిగా అభిమానులు తరలివచ్చారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయింది. ఈ విషయంలో అల్లు అర్జున్‌ బాధ్యతారహితంగా వ్యవహరించారు. వద్దని వారించినా అల్లుఅర్జున్‌ అక్కడికి వచ్చారు. బౌన్సర్లు, అభిమానులు పరస్పరం తోసుకోవడం వల్లే తొక్కిసలాట జరిగింది.  

అల్లు అర్జున్‌కు కాలు పోయిందా.. కన్ను పోయిందా.. ఎందుకు పరామర్శలు.. 

‘అల్లు అర్జున్‌కు కాలు పోయిందా కన్ను పోయిందా, కిడ్నీలు చెడిపోయాయా ఆయనను అందరూ ఎందుకు పరామర్శిస్తున్నారు. పోలీసులు సంధ్య థియేటర్‌తో పాటు అల్లు అర్జున్‌పై కేసు పెట్టారు. నెలకు 30 వేలు సంపాదించే ఒక అభిమాని టికెట్‌ రూ.12 వేలు పెట్టి కొన్నాడు. అలాంటి అభిమాని చనిపోతే హీరో కనీసం పట్టించుకోలేదు. పోలీసులు ప్రథమ చికిత్స చేసినప్పటికీ రేవతి బతకలేదు. శ్రీతేజ బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడు. 

తల్లి చనిపోయి, కొడుకు చావు బతుకుల్లో ఉంటే హీరో అల్లు అర్జున్‌ పట్టించుకోకుండా సినిమా చూసుకుంటూ అక్కడే ఉన్నాడు. చివరకు డీసీపీ వచ్చి అరెస్టు చేస్తామని చెబితే అప్పుడు అక్కడినుంచి హీరో వెళ్లాడు. థియేటర్‌ సిబ్బంది హీరో దగ్గరికి పోలీసులను వెళ్లనివ్వలేదు. 11 రోజుల తర్వాత హీరో దగ్గరికి పోలీసులు వెళితే దురుసుగా ప్రవర్తించారు. ఈవిషయంలో పదేళ్లు మంత్రిగా చేసిన వ్యక్తి నాపై అడ్డగోలుగా ట్వీట్‌ చేశాడు. చనిపోయిన వాళ్లను పట్టించుకోకుండా సీఎంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. బెనిఫిట్‌ షోకు అనుమతిచ్చింది ప్రభుత్వమే కదా’ అని సీఎం రేవంత్‌ అన్నారు. 

నేను సీఎంగా ఉన్నంత వరకు టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలు ఉండవు

తల్లి చనిపోయి పిల్లాడు బ్రెయిన్‌ డెడ్‌ అయితే సినిమా వాళ్లు ఎవరైనా పరామర్శకు వెళ్లారా. సినిమా వాళ్లు ఇన్సెంటివ్స్‌ కావాలంటే తీసుకోండి.. ప్రివిలేజ్‌ కావాలంటే కుదరదు. ఇక నుంచి టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలకు అనుమతి ఉండదు. నేను సీఎంగా ఉన్నంత వరకు అనుమతివ్వను. నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు మీ ఆటలు సాగనివ్వను. సినిమా వాళ్లంటే పోనీ.. రాజకీయ నాయకులు కూడా ఇష్టం వచ్చినట్లు నాపై విమర్శలు చేశారు’అని సీఎం రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్

 

 

Advertisement
 
Advertisement
Advertisement