ఆంధ్రప్రదేశ్‌తో చర్చలకు సిద్ధం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Says That He Is Ready For Talks With Andhra Pradesh Over Krishna And Godavari Water | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌తో చర్చలకు సిద్ధం: సీఎం రేవంత్‌

Jun 21 2025 4:57 AM | Updated on Jun 21 2025 8:52 AM

CM Revanth Reddy says that he is Ready for talks with Andhra Pradesh

నదీ జలాలపై వివాదాల పరిష్కారంలో మాకెలాంటి భేషజాలు లేవు  

23న కేబినెట్‌ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం 

అవసరమైతే నేనే స్వయంగా చంద్రబాబును ఆహ్వానిస్తా 

ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి 

మోదీ సీట్లో కూర్చోవాలంటే చంద్రబాబు సహకారం కావాలి 

బాబు మళ్లీ గెలవాలంటే గోదావరి నీళ్లు కావాలి 

కానీ మేం ఎవరి కోసమో రాష్ట్రం హక్కులు వదులుకోలేమన్న ముఖ్యమంత్రి

సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో తమకెలాంటి భేషజాలు లేవని, ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడితో ముఖాముఖి చర్చలు జరిపే అంశంపై ఈ నెల 23న జరిగే కేబినెట్‌ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

అవసరమైతే చర్చలకు తానే స్వయంగా చంద్రబాబును ఆహ్వానించేందుకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. ‘గోదావరి జలాలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం చాలా ముఖ్యం. తెలంగాణ హక్కులను హరించే ఏ ప్రతిపాదనలనైనా వివిధ వేదికలపై అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. 

ఏపీ చేపట్టిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మేము వివాదాలు కోరుకోవడం లేదు. అదే సమయంలో మా హక్కుల విషయంలో రాజీ పడబోము..’అని సీఎం స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేసేందుకు గురువారం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 

ఏపీతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం.. 
‘తెలంగాణ, ఏపీ మధ్య గోదావరి, కృష్ణా జలాల పంపిణీయే ప్రధాన సమస్య. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం టెక్నికల్, అపెక్స్, అధికారుల కమిటీలున్నాయి. సమస్యలపై రెండు రాష్ట్రాల అధికారులు, మంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేది. అలా కాకుండా బనకచర్ల ప్రాజెక్టుపై పీఎఫ్‌ఆర్‌ (పీ ఫీజబిలిటీ రిపోర్ట్‌)ను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం అందజేయడంతో వివాదం మొదలైంది. 

సమస్య ఏదైనా చర్చల ద్వారా పరిష్కారం అవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సత్సంబంధాలు కోరుకున్నట్లే, తెలంగాణ కూడా ఏపీతో సత్సంబంధాలు కోరుకుంటోంది..’అని సీఎం అన్నారు.  

ముందు మా ప్రాజెక్టులు పూర్తికావాలి.. 
‘మోదీ సీట్లో కూర్చోవాలంటే చంద్రబాబు సహకారం కావాలి. బాబు మళ్లీ ఏపీలో గెలవాలంటే ఆయనకు గోదావరి నీళ్లు కావాలి. అయితే ఎవరి కోసమో మా హక్కులను వదులుకోలేము. లిటిగేషన్లు, వివాదాలతో ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. తెలంగాణలో మా ప్రాజెక్టులు పూర్తయి, పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకున్న తర్వాతే.. ఏపీ తమ ప్రాజెక్టుల గురించి ఆలోచించాలి..’అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 

రాజకీయం చేస్తోంది బీఆర్‌ఎస్సే.. 
‘తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాటు నీళ్లు, నిధులు, నియామకాలు అనే మోసపూరిత సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసింది. ఇప్పుడు అదే జలాలను ఆ పార్టీ సంజీవనిగా భావిస్తోంది. కృష్ణా–గోదావరి జలాల విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తప్పు చేసింది. 

అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులే గోదావరి జలాలపై ఏపీకి అన్ని హక్కులు రాసిచ్చి తెలంగాణకు అన్యాయం చేశారు..’సీఎం ఆరోపించారు.  

కిషన్‌రెడ్డికి కేటీఆర్‌ ప్రైవేట్‌ ట్యూటర్‌ 
‘కిషన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రైవేట్‌ ట్యూటర్‌. ఆయన ఏం చెబితే అదే చేస్తారు. కేంద్రానికి కేటీఆర్‌కు మధ్య లైజనింగ్‌ ఆఫీసర్‌. నేను కేంద్ర మంత్రులను కలుస్తానని, తనతో కలిసి రావాలని కిషన్‌రెడ్డికి ముందే లేఖ ద్వారా సమాచారం ఇచ్చా. 

అయినా ఆయన రాలేదు. నేను కేంద్ర మంత్రులు సీఆర్‌ పాటిల్, మనోర్‌లాల్‌ ఖట్టర్‌లను కలవడానికి ముందే.. కేటీఆర్‌ డైరెక్షన్‌ మేరకు కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు..’అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement