ఎవరిమీద మీ సమరం?.. ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్‌ ఆగ్రహం | Cm Revanth Reddy Fire On Tgsrtc Employees Union | Sakshi
Sakshi News home page

ఎవరిమీద మీ సమరం?.. ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్‌ ఆగ్రహం

May 5 2025 5:03 PM | Updated on May 5 2025 6:46 PM

Cm Revanth Reddy Fire On Tgsrtc Employees Union

సాక్షి,హైదరాబాద్‌: ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమరం అంటున్నారు.. ఎవరిమీద?. ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదు.   ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులే. మీకు జీతాలు ఇస్తున్న ప్రజలే మాకు ఉద్యోగాలిస్తున్నారు. మీరు ప్రకటించిన సమరం 97 శాతం ప్రజల మీదనా.  సమరం కాదు.. సమయ స్పూర్తి కావాలి. ఏవైనా సమస్యలు ఉంటే చర్చకు రండి.. చర్చిందాం. రాజకీయ నాయకుల్లో ఉద్యోగులు పావుగా మారొద్దు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వ సంఘాలకు లేదా? అని ప్రశ్నించారు.

కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదు. అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చు.. కానీ ఎక్కడా అప్పు పుట్టడం లేదు.స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారం.

ఉద్యోగ సంఘాల నాయకుల్లారా.. రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం.. కుటుంబ పరువును బజారున పడేయొద్దు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలనే రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నది.. నన్ను కోసినా… వచ్చిన ఆదాయానికి మించి నేను ఏం చేయలేను. ఉద్యోగ సంఘాల నాయకుల్లారా ఇప్పుడు కావాల్సింది సమరం కాదు… సమయస్ఫూర్తి, సంయమనం.

మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా… తెలంగాణను మళ్లీ కోతుల గుంపుకు అప్పగించొద్దు. నాతో కలిసి రండి.. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళదాం. ఇక సమరమే అని ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తున్నాయి. మీ సమరం తెలంగాణ ప్రజలపైనా? ఎందుకు మీ సమరం… గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా?.

రాజకీయ పార్టీల చేతుల్లో ఉద్యోగులు పావులు కావద్దు : సీఎం రేవంత్

ప్రతీ నెలా ఏడు వేల కోట్లు ప్రతీ నెలా కట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానిది. గత పాలకులు 8500 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారు. కొన్ని రాజకీయ పార్టీలు మాపై ఆరోపణలు చేస్తున్నాయి.. అవన్నీ వాళ్లు చెల్లించకుండా పెండింగ్ పెట్టి వెళ్లిన బకాయిలే. కేవలం పదహారు నెలల్లో మేం 30 వేల కోట్ల నగదు రైతుల ఖాతాలకు బదిలీ చేశాం.

ఉచిత విద్యుత్ అని చెప్పి విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టి వెళ్లారు. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికిబకాయి పెట్టి వెళ్లారు. ప్రాజెక్టులు కట్టామని చెప్పి .. కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టారు. 11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారు.. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?. ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదు… మనమంతా కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు.. సేవకులం.

ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరం అని అంటున్నారు. ఎవరిపై సమరం… ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement