లాస్య నందిత పోస్టుమార్టం నివేదిక.. సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడం వల్లే.. | Cantonment MLA Lasya Nandita Death: Post Mortem Report Out | Sakshi
Sakshi News home page

లాస్య నందిత పోస్టుమార్టం నివేదిక.. సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడం వల్లే..

Feb 23 2024 2:11 PM | Updated on Feb 23 2024 3:17 PM

Cantonment MLA Lasya Nandita Death: Post Mortem Report Out - Sakshi

పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై కారు ప్రమాదంలో లాస్య నందిత దుర్మరణం పాలు కాగా.. పోస్టుమార్టంలో.. 

హైదరాబాద్‌, సాక్షి: కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం యావత్‌ రాష్ట్రాన్ని నివ్వెరపోయేలా చేసింది. పటాన్‌ చెరు ఓఆర్‌ఆర్‌పై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఆమె మృతదేహానికి జరిగిన పోస్టుమార్టం నివేదిక(ప్రాథమిక) బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడి అయ్యాయి. లాస్య తలకు బలమైన గాయాలు కావడంతోనే ఆమె స్పాట్‌లోనే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది. 

‘‘తలకు బలమైన గాయాలు కావడం వల్లే అక్కడికక్కడే ఆమె చనిపోయారు. లాస్య నందిత శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. తై బోన్‌, రిబ్స్‌ ఫ్రాక్ఛర్‌ అయ్యాయి. ఆరు దంతాలు ఊడిపోయాయి. ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది. మొత్తంగా.. సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడం వల్లే ఆమె మరణించారు’’ అని పోస్టుమార్టం నివేదికలో నిపుణులు పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగిసిన అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

రావాల్సిన స్పష్టత
లాస్య తప్ప ఆమె కుటుంబ సభ్యులు గురువారం రాత్రి సదాశివపేట (మం) కొనాపూర్‌లోని మిస్కిన్ బాబా దర్గాకి వచ్చారు. కాసేపటికే  ఆకాష్‌తో పాటు లాస్య కూడా దర్గాకి వచ్చారు. లాస్య కుటుంబం అంతా రాత్రి 12.30 గంటలకు దర్గాలో పూజలు చేశారని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. తిరిగి.. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో హైదరాబాద్‌కు లాస్య కుటుంబం పయనం అయ్యింది. మొక్కులు తీర్చుకున్న తర్వాత.. 3 నుంచి 4 గంటల మధ్య లాస్య బయల్దేరిందని చెప్తున్నారు. అయితే.. పటాన్ చెరు వైపు ఎందుకు ఆమె వాహనం వెళ్లింది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇదీ చదవండి: లాస్య నందితను వెంటాడిన మృత్యువు

పూర్తిస్థాయి విచారణ తర్వాతే.. 
సుల్తాన్‌పూర్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురైంది. ఘటనాస్థలాన్ని సంగారెడ్డి ఏఎస్పీ సంజీవ రావు, ఆర్టీఏ రామారావు పరిశీలించారు. ఏఎస్పీ సంజీవరావు మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 5:30 గంటలకు ప్రమాదం జరిగినట్టు పోలీసులకు సమాచారం అందింది. కారు శకలాలు 100 మీటర్ల దూరంలో పడి ఉన్నాయి. అక్కడిక్కడే ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు. మరో వ్యక్తి ఆకాష్ మియపూర్ లో ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తాం అని అన్నారాయన.

Advertisement
 
Advertisement
Advertisement