సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రెవెన్యూ శాఖలో ‘22A’ చుట్టూ భారీ అవినీతి జరుగుతోందా? నిషేధిత భూముల జాబితా నుంచి ఆస్తులను తొలగించేందుకు ఏకంగా 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు.
22A నిబంధన ఉద్దేశం నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడమేనని హరీష్రావు పేర్కొన్నారు. అయితే ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడేందుకు ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్ఎండీఏ అనుమతులు ఉన్న వేలాది ప్రైవేటు ఆస్తులను కూడా ఏకపక్షంగా 22A జాబితాలో చేర్చి యజమానులను వేధిస్తున్నారని విమర్శించారు.
రెవెన్యూ శాఖలో 30 శాతం కమీషన్ రాకెట్ నడుస్తోందన్నది హరీష్రావు చేసిన మరో సంచలన ఆరోపణ. నిషేధిత జాబితా నుంచి ఆస్తులను తొలగించుకునేందుకు దళారులు మార్కెట్ విలువలో ఏకంగా 30 శాతం వరకు కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఇవి ఆరోపణలేనని, వీటిపై స్వతంత్ర దర్యాప్తుతో నిజానిజాలు తేలాల్సి ఉందని పేర్కొనడం సముచితం.
యాదాద్రి జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాలను 22A జాబితాలో చేర్చినట్లు నాలుగు నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారని హరీష్రావు తన లేఖలో ప్రస్తావించారు. ఇంత పెద్ద స్థాయిలో భూములు నిషేధిత జాబితాలోకి ఎలా వెళ్లాయి? వాటి వెనుక కారణాలేంటి? అన్న దానిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూములపైనా హరీష్రావు తీవ్ర ఆరోపణలు చేశారు. భూములపై వివాదాలు సృష్టించి, రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాలు చేసుకునేలా భూ యజమానులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాల కోసం రెవెన్యూ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని విమర్శించారు.
ఈ మొత్తం వ్యవహారంపై 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 22A జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి భూమిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలని హరీష్రావు డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ ఆరోపణలతో కాకుండా.. ఎవరి ఆదేశాలతో ఏ ఆస్తిని జాబితాలో చేర్చారు? ఎందుకు తొలగించారు? అనే అంశాలను తేల్చాలని కోరారు. అంతేకాదు.. 30 శాతం కమీషన్లు, 50:50 జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? దళారులు, బినామీ సంస్థలను నడిపిస్తున్న రాజకీయ శక్తులు ఏవి? అనే విషయాలను దర్యాప్తులో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి ఆస్తుల జాబితాలో మార్పులు చేసిన అధికారులు, మధ్యవర్తుల ప్రమేయం, జరిగిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించాలని హరీష్రావు కోరారు. మొత్తంగా 22A వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణకు సిద్ధమవుతుందా? లేక ఆరోపణలు-ప్రత్యారోపణలకే పరిమితం అవుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


