పార్టీ పునర్వ్యవస్థీకరణపై బీఆర్ఎస్ దృష్టి
సర్వశక్తులూ ఒడ్డేందుకు సన్నద్ధం
వచ్చే ఏడాది కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్ర ఉంటాయని సంకేతాలు
40 నియోజకవర్గాల్లో కొత్త తరానికి అవకాశం!
పాతబస్తీలోనూ బలమైన అభ్యర్థులను దించాలనే వ్యూహం
యువత, ఉద్యమకారుల్లో టికెట్లపై భారీ ఆశలు
చేరికలు, పునరాగమనాలతో రాజకీయ సమీకరణాలు మారే సూచనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండున్నరేళ్ల క్రితం అధికార పీఠానికి దూరమైన బీఆర్ఎస్ తిరిగి పూర్వవైభవం సాధించాలని భావిస్తోంది. ఇందుకు సర్వశక్తులూ ఒడ్డేందుకు సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేస్తున్న బీఆర్ఎస్ మరోవైపు సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపైనా దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది పార్టీ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు బస్సు యాత్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాదయాత్ర ఉంటుందని బీఆర్ఎస్ సంకేతాలు ఇస్తోంది. అదే సమయంలో నాయకత్వలేమి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన నాయకుల కోసం అన్వేష్కిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి హైదరాబాద్లోని పాతబస్తీ సహా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది.
చురుగ్గా యువనేతలు...
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు ఇతర పార్విల్లోకి వలసపోయారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు అటు పార్టీ అధినాయకత్వం, ఇటు కేడర్తో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు మాజీ ఎమ్మెల్యేల వివాదాస్పద వైఖరితో పార్వికి చెడ్డపేరు వచ్చిందనే ఆరోపణలున్నాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల అభ్యర్థులను మార్చకపోవడం వల్లే ఓటమి పాలయ్యామనే అభిప్రాయాన్ని కేటీఆర్ పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో కొత్త తరానికి అవకాశమివ్వాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలిసింది.
అదీగాక, గతంలో విద్యార్థి, యువజన విభాగాలతోపాటు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేతలే ప్రస్తుతం పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా అవకాశం దక్కుతుందనే ఆశావహ దృక్పథం వీరిలో కనిపిస్తోంది. మరోవైపు పునర్విభజనతో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందనే వార్తల నేపథ్యంలో ఆశావహులు సందడి చేస్తున్నారు. పార్విలో అనేక మంది సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల్లో తమ వారసులతో అరంగేట్రం చేయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహిళా, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయా కేటగిరీలకు చెందిన వారు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి బీఆర్ఎస్వైపు చూస్తున్నట్లు సమాచారం.
నిష్క్రమణలు.. చేరికలు..
⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోణప్ప ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్లో చేరారు. అక్కడ పొసగక తిరిగి బీఆర్ఎస్ గూటికి తిరిగి చేరుకుని క్రియాశీలమయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక్కడ బీఎస్పీ నుంచి పోటీచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరి నాగర్కర్నూలు ఎంపీగా పోటీ చేసి, ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ అచ్చంపేట (ఎస్సీ) నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశముంది. నిర్మల్లో ఓటమి అనంతరం మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కాంగ్రెస్లో చేరినా క్రియాశీలంగా పనిచేయడం లేదు. ఆయన తిరిగి బీఆర్ఎస్లో చేరే అవకాశాలున్నాయి. ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్ స్థానికంగా బలమైన నాయకుడి కోసం అన్వేష్కిస్తోంది.
⇒ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కుమారుడిపై కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్మూరులో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితయ్యారు.
⇒ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కాంగ్రెస్లో చేరడంతో మాజీ మంత్రి జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. రామగుండంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భారీ ఓట్ల తేడాతో ఓడిపోవడాన్ని పార్విలో ఆయన ప్రత్యర్థులు ఎత్తి చూపుతున్నారు.
⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నా వారి వయసు, ఆరోగ్య కారణాలతో కొత్త ముఖాలు తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు.
⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేశ్ బీజేపీ నుంచి తిరిగి బీఆర్ఎస్లో చేరారు. స్టేషన్ ఘనపూర్లో పార్టీని వీడిన కడియం శ్రీహరి స్థానంలో మాజీ మంత్రి రాజయ్య తిరిగి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మాజీ ఎంపీ డాక్టర్ వినోద్ కుమార్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
⇒ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరడంతో పార్టీ కేడర్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమన్వయం చేస్తున్నారు.
⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం (ఎస్టీ) ఎమ్మెల్యే వెంకట్రావు కాంగ్రెస్లోకి ఫిరాయించడంతో ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ సాగుతోంది. కొత్తగూడెంలోనూ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్థానంలో వెతుకులాట సాగుతోంది.
⇒ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కాంగ్రెస్లో చేరడంతో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్రెడ్డి పార్టీ కేడర్ను సమన్వయం చేస్తున్నారు. శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కాంగ్రెస్కు చేరువ కావడంతో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ తాండూరు తన కార్యకలాపాలు ముమ్మరం చేశారు.
⇒ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో గతంలో ఎంఐఎంతో దోస్తీ మూలంగా ఏడు చోట్ల స్నేహపూర్వక పోటీకి బీఆర్ఎస్ పరిమితమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాతబస్తీలోనూ బలమైన అభ్యర్థులను పోటీ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దానం నాగేందర్ బీఆర్ఎస్లో చేరడంతో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మన్నె క్రిశాంక్ పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెడుతున్నారు.


