బెంగళూరులో నవ దంపతుల ఆత్మహత్య వ్యవహారం..
గానవి కుటుంబంపై సూరజ్ బంధువుల కేసు
బెంగళూరు: బెంగళూరుతో పాటు రాష్ట్రమంతటా సంచలనం కలిగిస్తున్న నవ వివాహిత గానవి, భర్త సూరజ్ ఆత్మహత్యల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. భర్త ఆదరించలేదని, నపుంసకుడని ఆరోపిస్తూ గానవి మెట్టినింటిలో ఆత్మహత్యాయత్నం చేసి రెండురోజుల తరువాత కన్నుమూసింది. ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టడంతో సూరజ్, అతని తల్లి జయంతి, అన్న నాగపూర్కు పరారయ్యారు, అక్కడ సూరజ్ శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో రెండు నెలలకే కొత్త జంటకు నూరేళ్లు నిండాయి.
హనీమూన్లో పోట్లాట అందుకే
అయితే గానవి పెళ్లికి ముందు ఓ యువకున్ని ప్రేమించిందని ఆదివారం ప్రచారంలోకి వచ్చింది. ఆమె భర్తతో శ్రీలంకకు హనీమూన్ వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తాను హర్ష అనే యువకున్ని ప్రేమిస్తున్నట్లు భర్తకు చెప్పడమే కారణమని తెలిసింది. అతనినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని, తల్లిదండ్రుల ఒత్తిడితో నిన్ను చేసుకున్నట్లు ఆమె చెప్పడంతో సూరజ్ కుంగిపోయాడు. హనీమూన్ని రద్దుచేసుకుని తిరిగి వచ్చినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో సూరజ్ మృతికి గానవి తల్లిదండ్రులు కారణమని అతని బావ రాజ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యారణ్యపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గానవి తల్లి రుక్మిణి రాధ, బాబుగౌడ, సతీశ్లు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేయడం వల్ల సూరజ్ ప్రాణాలు తీసుకున్నాడన్నారు. రెండు కుటుంబాల్లో ఇద్దరు చనిపోవడంతో పాటు, కేసులు పెట్టుకుంటూ బతుకులను బుగ్గి చేసుకుంటున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది.


