లోన్ కట్టలేదని ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు | Bank Officials Seize Farmer Gate Over Unpaid Loan | Sakshi
Sakshi News home page

లోన్ కట్టలేదని ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు

Feb 13 2025 10:58 AM | Updated on Feb 13 2025 11:19 AM

Bank Officials Seize Farmer Gate Over Unpaid Loan

ఇంటి గేటు తీసుకెళ్లమని అందించిన బాధిత కుటుంబం 

కొడకండ్ల (జనగాం): తీసుకున్న రుణం చెల్లించాలని బ్యాంక్‌ అధికారులు(Bank Officials) ఓ కుటుంబాన్ని నిలదీసిన ఘటన బుధవారం ఏడునూతన గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఐదుగురు మహిళల చొప్పున మూడు గ్రూపులకు 2021సంవత్సరంలో విజయ డెయిరీ(Vijaya Dairy) ఆధ్వర్యంలో డీసీసీబీ స్టేషన్‌ఘన్‌పూర్‌ బ్రాంచ్‌ ద్వారా గేదెల కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ.87వేల చొప్పున రుణం అందించారు. ఈఎంఐ రూ.4వేల చొప్పున కొన్ని నెలల పాటు మహిళలు చెల్లించారు.

 అనంతరం గేదెలు పాలు ఇవ్వకపోవడంతో మహిళలకు ఆర్థిక ఇబ్బందులతో ఈఎంఐలు చెల్లించలేదు. దీంతో బ్యాంక్‌ అధికారులు డిఫాల్టర్‌లకు నోటీసు ఇచ్చి రికవరీ ప్రయత్నాలు చేయగా కొందరు రుణం చెల్లించారు. తాజాగా బుధవారం డీసీసీబీ స్టేషన్‌ఘన్‌పూర్, కొడకండ్ల బ్రాంచ్‌ మేనేజర్లు మహబూబీ, కల్యాణిలతో పాటు ఫీల్డ్‌ ఆఫీసర్లు మరోసారి రుణం బాకీ ఉన్న వారి ఇంటికి వెళ్లి నోటీసులిచ్చి రుణం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పారు. 

ఇందులో మద్దెబోయిన కళమ్మ, కుటుంబసభ్యులు రుణం కట్టడం ఇబ్బందిగా ఉందని తెలిపి ఇంటి గేట్లు తీసుకెళ్లమని బ్యాంక్‌ అధికారులు తీసుకొచ్చిన ట్రాక్టర్‌ డబ్బాలో వేయడంతో వారు తీసుకెళ్లారు. ఈ సంఘటన సామాజిక మాద్యమాల్లో వైరల్‌ కాగా బ్యాంక్‌ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని తెలుపుతున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement