డీఎస్పీ నాగేంద్రచారితో మాట్లాడుతున్న కేంద్రమంత్రి బండి సంజయ్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీపై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు
సిరిసిల్ల: ‘మీ ఎస్పీ గారికి మావాళ్ల మీద ఎందుకంత కోపం.. బీఆర్ఎస్పై ఎందుకంత ప్రేమ.. మా కార్యకర్తలను బష్కీలు (గుంజీలు) తీయిస్తారా మీ ఎస్పీగారు. కేటీఆర్పై ప్రేముంటే పోయి బీఆర్ఎస్లో మీ ఎస్పీ గారిని చేరమనండి’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ వ్యాఖ్యానించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ప్రధాని నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలనపై ‘స్వచ్ఛ పాఠశాల’కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు.సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి పూలమొక్క అందించి స్వాగతం పలుకుతుండగా.. జిల్లా ఎస్పీ మహేశ్ బి.గీతేపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సిరిసిల్లలో బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో పోలీసులు బీఆర్ఎస్కు అనుకూలంగా, బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించారని పరోక్షంగా సంజయ్ స్పందించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్లో తరగతి గదులను శుభ్రం చేశారు. క్లాస్రూమ్ ఊడ్చి, నీళ్లతో కడిగారు. బీజేపీ జెండాలను పక్కనబెట్టి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని సంజయ్ తెలిపారు.


