ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయండి 

Amberpet constituency Complete The Flyover Construction On Time: Kishan Reddy - Sakshi

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  

అంబర్‌పేట: అంబర్‌పేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లైఓవర్‌ నిర్మాణం గడువులోపు పూర్తయ్యేలా ఆయా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు చొరవ తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అధికారులకు సూచించారు. అంబర్‌పేటలోని గోల్నాక నుంచి ఛే నంబర్‌ చౌరస్తా మీదుగా ముఖ్రమ్‌ హోటల్‌ వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ పనులపై మంగళవారం ఆయన వివిధ విభాగాల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం వారితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఫ్లైఓవర్‌ కోసం చేపట్టిన స్థల సేకరణ పూర్తిస్థాయిలో సేకరించారా అని ప్రశ్నించారు.

నిర్మాణం సందర్భంగా పైప్‌లైన్‌ వ్యవస్థ, విద్యుత్‌ వ్యవస్థ తొలగించే క్రమంలో స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నాణ్యత ప్రమాణాలతో ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. త్వరలో పూర్తిస్థాయి సమీక్ష సమావేశాన్ని చేపడతానని ఆయన అధికారులకు తెలిపారు. కార్పొరేటర్లు పద్మ వెంకట్‌రెడ్డి, ఉమా రమేష్‌ యాదవ్, అమృత, బీజేపీ నేతలు గౌతమ్‌రావు, వెంకట్‌రెడ్డి, అజయ్‌కుమార్, వనం రమేష్, చిట్టి శ్రీధర్, రవీందర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top