ఫ్రిడ్జ్‌లో మృతదేహం కేసుపై సుప్రీంలో తీర్పు రిజర్వ్‌ | 15 Bcak Years Murder Case Supreme Court Reserved | Sakshi
Sakshi News home page

ఫ్రిడ్జ్‌లో మృతదేహం కేసుపై సుప్రీంలో తీర్పు రిజర్వ్‌

Aug 25 2026 11:07 AM | Updated on Aug 25 2026 11:14 AM

15 Bcak Years Murder Case Supreme Court Reserved

సాక్షి, న్యూఢిల్లీ:  సుమారు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన యువకుడి కిడ్నాప్, హత్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. మృతదేహాన్ని ఫ్రిడ్జ్‌లో దాచిన ఈ అమానుష ఘటనలో ప్రధాన నిందితుడు కొండపాక శ్రీధర్‌ అలియాస్‌ శేఖర్‌ (ఏ1) దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. 

కింది కోర్టు విధించిన జీవిత ఖైదును ఉమ్మడి హైకోర్టు సమర్థించడాన్ని సవాల్‌ చేస్తూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌ల ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు లోపాలు, సాక్ష్యాధారాల లేమిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తుది తీర్పును వాయిదా వేసింది.

సుప్రీంలో సుదీర్ఘ వాదనలు..
విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరపు న్యా యవాది వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో ఆరుగురు నిందితుల్లో ఒకరు విచారణ దశలోనే చనిపోయాడని, మిగిలిన ఐదుగురికి కింది కోర్టు జీవిత ఖైదు ఖరారు చేసిందన్నారు. కానీ.. పైకోర్టు నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసి, శ్రీధర్‌కు మాత్రమే శిక్షను సమర్థించిందని తెలిపారు. అతడు ప్లాట్‌ను అద్దెకు తీసుకున్నట్లు కచ్చితమైన ఆధారాలు లేవని, ఇప్పటికే 16 ఏళ్లుగా జైలుకే పరిమితమయ్యాడని, బెయిల్‌ వచ్చినా పూచీకత్తు సమర్పించలేని స్థితిలో ఉన్నాడని వివరించారు. మరోవైపు ప్రభుత్వం తరపు న్యాయవాది వాదిస్తూ.. ఘట నా స్థలంలోని ఫ్రిడ్జ్‌పై ఉన్న వేలిముద్రలు శ్రీధర్‌వేనని ఫొరెన్సిక్‌ నివేదిక స్పష్టం చేసిందన్నా రు. ఘటనకు ముందు బాధితుడిని నిందితుడే ప్లాట్‌కు తీసుకెళ్లడాన్ని వాచ్‌మన్‌ చూశాడని, మృతుడికి చెందిన ఆర్టీసీ బస్‌ పాస్‌ కూడా నిందితుడి వద్దే లభ్యమైందని కోర్టు దష్టికి తీసుకొచ్చారు.

ధర్మాసనం వ్యాఖ్యలు..
వాదనలు విన్న  జస్టిస్‌ పార్దివాలా ధర్మాసనం పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. కింది కోర్టు శిక్ష పడిన నలుగురిని హై కోర్టు విడుదల చేస్తే వారిపై ప్రభుత్వం ఎందుకు అప్పీల్‌కు వెళ్లలేదని నిలదీసింది. సహ నిందితులను వదిలేసి.. ఒకే వ్యక్తిపై హత్యానేరా న్ని ఎలా నిర్ధారిస్తారని వ్యాఖ్యానించింది. ఇంటి ఓనర్‌కు నిందితుడు ఎవరో తెలియదని, కేవలం వాచ్‌మన్‌ మాత్రమే చూశానని చెప్పడాన్ని ‘లాస్ట్‌ సీన్‌’ కింద మాత్రమే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. మృతుడికి చెందిన బస్‌ పా స్‌ నిందితుడికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పాలంటూ ప్రాసిక్యూషన్‌ను ప్రశ్నించింది. సరైన ఆధారాలు నిరూపించకుండా 16 ఏళ్లుగా ఒక వ్యక్తి జైలులో ఉండటంపై స్పంది స్తూ.. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

గతంలో ఏం జరిగిందంటే..: 
2011 జూన్‌లో జగిత్యాలకు చెందిన శ్రీనివాస్‌ అనే యువకుడు హైదరాబాద్‌కు వచ్చి అదశ్యమయ్యాడు. కిడ్నాపర్లు ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయడంతో.. బాధితుడి తండ్రి రూ.1.50లక్షలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. ఆ బ్యాంక్‌ లావాదేవీలు, ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఉప్పల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో గాలింపు చేపట్టారు. అక్కడి 402వ నంబరు ప్లాట్‌లోని ఫ్రిడ్జ్‌లో శ్రీనివాస్‌ మృతదేహం ప్లాస్టిక్‌ కవర్లు, వైర్లతో చుట్టి కుళ్లిన స్థితిలో కనిపించింది. ఈ కేసులో కరీంనగర్‌ కోర్టు ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. 

అయితే సీసీటీవీ ఫుటేజీలు, కాల్‌ డేటాలకు సంబంధించి 65–బీ సర్టిఫికెట్‌ లేకపోవడంతో పాటు పలు సాంకేతిక కారణాలతో హై కోర్టు నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ప్లాట్‌ అద్దెకు తీసుకున్నది, బాధితుడిని చివరిసారిగా అక్కడికి తీసుకెళ్లింది శ్రీధర్‌ కావడంతో సెక్షన్‌ 106 కింద అతడి శిక్షను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఈ తీ ర్పుపైనే శ్రీధర్‌ సుప్రీంను ఆశ్రయించాడు.   

కొడుకు వరుసైన వ్యక్తితో భార్య అక్రమ సంబంధం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement