రాష్ట్రంలో టీసీఎల్‌ యూనిట్‌ ఏర్పాటు | Establishment of TCL unit in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో టీసీఎల్‌ యూనిట్‌ ఏర్పాటు

Jun 29 2023 2:55 AM | Updated on Jun 29 2023 3:23 AM

Establishment of TCL unit in the state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ సంస్థ టీసీఎల్‌.. తెలంగాణలో కంపెనీని ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ రాష్ట్రానికి చెందిన రిసోజెట్‌ సంస్థతో కలసి కన్జ్యూమర్‌ ఎల్రక్టానిక్‌ గూడ్స్‌ తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఈ మేరకు బుధవారం పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సమక్షంలో రిసోజెట్‌తో టీసీఎల్‌ ప్రతినిధులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. టీసీఎల్‌ ఎల్రక్టానిక్స్‌ తన ప్రధాన కేంద్రం అయిన చైనాలోని హెఫెయి నగరం తర్వాత ఇతర దేశాల్లో ఏర్పాటు చేస్తున్న తొలి తయారీ యూనిట్‌ ఇదే కావడం గమనార్హం.

ఈ కంపెనీలో తొలుత వాషింగ్‌ మెషిన్లను తయారు చేస్తారు. అనంతరం రిఫ్రిజిరేటర్లు, డిష్‌ వాషర్ల వంటి ఇతర ఉపకరణాలనుకూడా తయారు చేస్తారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని ’ఈ– సిటీ’లో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్‌ కోసం టీసీఎల్‌ రూ.225 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఈ యూనిట్‌తో తొలిదశలోనే సుమారు 500 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెపుతున్నారు. రాష్ట్రంలో టీసీఎల్‌ కంపెనీ పెట్టుబడులు పెట్టడాన్ని మంత్రి కేటీఆర్‌ స్వాగతించారు.

ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ రంగానికి తెలంగాణ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, ఇక్కడ హైటెక్నాలజీ ఉత్పత్తుల తయారీకి మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం హైదరాబాద్‌ను షెన్జెన్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలను, టీసీ ఎల్‌ సంస్థ చైర్‌పర్సన్‌ జువాన్‌ డూకి మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరించారు.

తెలంగాణలో ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీకి ఉన్న అనుకూల పరిస్థితులు, మౌలిక వసతులు, తమ ప్రభుత్వ విధానాలను పరిశీలించేందుకు రాష్ట్రంలో పర్యటించాలని కేటీఆర్‌ ఆమెను ఆహా్వనించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కంపెనీ రెజల్యూట్‌ గ్రూప్‌ చైర్మన్‌ రమీందర్‌ సింగ్‌ సొయిన్, రాష్ట్ర ఎల్రక్టానిక్స్‌ విభాగం డైరెక్టర్‌ సుజాయ్‌ కారంపురి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement