హైకోర్టు తీర్పును సాకుగా చూపి పథకాన్ని ఎత్తివేసే యత్నం
తులం బంగారం హామీ నుంచి తప్పించుకునేందుకే ఈ కుట్ర
రేపు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపి పథకాలను ఎత్తివేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి అంశంపై హైకోర్టు నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి, మంత్రుల కేసుల్లో ప్రైవేటు న్యాయవాదులకు భారీగా చెల్లించే ప్రభుత్వం.. పేద ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన ఈ పథకాన్ని కాపాడేందుకు ఎందుకు కౌంటర్ వేయలేదని నిలదీశారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులతో ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో కేటీఆర్ మాట్లాడారు.
తులం బంగారం హామీ ఏమైంది?
కేసీఆర్ ప్రభుత్వం 2014లో ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా సుమారు 13 లక్షల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర సాయం అందించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఎన్నికల్లో కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఆ హామీని అమలు చేయాల్సి వస్తుందనే భయంతోనే పథకాన్ని రద్దు చేసేందుకు చూస్తోందని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి సాయం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కుట్రను అడ్డుకునేందుకు రేపు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, వార్డులో ‘కల్యాణలక్ష్మి ఏమైంది? షాదీ ముబారక్ ఏమైంది? తులం బంగారం ఎప్పుడు ఇస్తారు?’అంటూ కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీసేలా ప్రచారం నిర్వహించాలని కేటీఆర్ సూచించారు.


