ధాన్యం నమోదులో దగా!  | Deception in grain registration | Sakshi
Sakshi News home page

ధాన్యం నమోదులో దగా! 

Jul 1 2023 2:59 AM | Updated on Jul 1 2023 2:59 AM

Deception in grain registration - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌ వేసంగిలో 104 బస్తాల ధాన్యం తూకం వేశాడు. మిల్లు వద్ద ట్రక్‌షీట్‌లో 104 బస్తాలుగానే నమోదు చేశారని భావించాడు. కింద 104 మైనస్‌ 4 అని రాసినట్టుగా గమనించలేదు. తీరా 100 బస్తాలకు మాత్రమే నగదు జమ కావడంతో అవాక్కయ్యాడు.

ఇది ఒక్క కరీంనగర్‌లోనే కాదని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో మిల్లర్లు రైతుల కష్టాన్ని యథేచ్ఛగా దోచేశారని తెలుస్తోంది. మొన్నటిదాకా తాలు పేరిట కొనుగోలు కేంద్రాల్లో, నాణ్యత లేదని రైస్‌మిల్లులో క్వింటాలుకు 9 నుంచి 11 కిలోల వరకు కోతపెట్టారు. వీటికి తోడు తాజాగా మరో కొత్త తరహా దోపిడీకి మిల్లర్లు తెరతీసినట్లు.. శ్రీనివాస్‌ తరహా ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి.  

రూ.వందల కోట్ల విలువైన ధాన్యానికి ఎసరు 
గతేడాది 50.23 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. అయితే ఈసారి అకాల వర్షాలు ఇబ్బంది పెట్టినా దిగుబడి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 7,037 కొనుగోలు కేంద్రాల్లో 11,39,597 మంది రైతుల నుంచి ఇప్పటివరకూ 66.49 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఈ మొత్తం ధాన్యం విలువ రూ.12,011 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు.

ఇందులో దాదాపు రూ.1,500 కోట్లు మినహా మొత్తం ధాన్యం డబ్బులు ప్రభుత్వం చెప్పిన విధంగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. వాస్తవానికి ప్రతి క్వింటాలుకు సగటున 10 కిలోల చొప్పున లెక్కలు వేసుకుంటే.. వేలాది క్వింటాళ్ల వరకు ధాన్యం కోతకు గురైంది. సాధారణ తరుగుతోనే రూ.కోట్లు వెనకేసుకున్న మిల్లర్లు ట్రక్‌ïÙట్ల మాయాజాలం కుంభకోణంతో రూ.వందల కోట్ల విలువైన ధాన్యాన్ని పోగు చేసుకున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.  

మొత్తం 21 బస్తాలకు కోత..! 
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం చిన్న»ొంకురుకి చెందిన రైతులు 10 మంది స్థానిక పీఏసీఎస్‌లో ధాన్యం అమ్ముకున్నారు. ధాన్యం కాంట వేస్తున్నప్పుడే తరుగు పేరుతో 2 కిలోలు కోత విధించారు. 10 మంది రైతులకు చెందిన 625 బస్తాల ధాన్యం లారీలో లోడ్‌ చేసి మిల్లుకు తరలించారు.

అయితే రైతులకు తెలియకుండానే మిల్లుల్లో సైతం మరోసారి కటింగ్‌ పెట్టారు. తర్వాత ట్రక్‌ షీట్‌ మాయాజాలంతో కేవలం 604 బస్తాలకే లెక్కగట్టారు. ఆ మేరకే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో తమకు ధాన్యం డబ్బులు తక్కువపడ్డాయని రైతులు వాపోతున్నారు. ఎంతలేదన్నా వీరి వద్దనుంచి 9 క్వింటాళ్ల వరకు ధాన్యం దోపిడీకి గురైంది. 

11 బస్తాలు కొట్టేశారు 
వేసంగి ధాన్యాన్ని మహమ్మదాబాద్‌లోని కొను గోలు కేంద్రం ద్వారా విక్రయించాం. నాతో పాటు మరో ఇద్దరు రైతుల బస్తాలు కలిపి మొ త్తం 383 బ్యాగులు తూకం వేశారు. తొలుత కొనుగోలు కేంద్రంలోనే తరుగు పెట్టారు. మళ్లీ మిల్లు వద్దకు వెళ్లాక మొత్తం మీద 372 బస్తాలుగా ట్రక్‌ïÙటులో నమోదు చేశారు.  – ఎండీ ఆలీ, కంచన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ 

తేమ, తాలు పేరుతో కట్‌ చేశారు.. 
యాసంగి సీజన్‌లో పండించిన ధాన్యాన్ని ఇప్పగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్‌కు తీసుకెళ్లా. కాంటా పూర్తయిన తర్వాత, 439 బస్తాలు ఉన్నట్లు లెక్కవేసి రైస్‌ మిల్లుకు పంపించారు. ధాన్యం బస్తాలు మిల్లుకు వెళ్లిన తర్వాత తేమ, తాలు పేరిట కొన్ని బస్తాలు కట్‌ చేశారు. మొత్తం మీద 428 బస్తాలనే బిల్లులో చూపించారు.  –జి.వెంకటయ్య, ఇప్పగూడెం, స్టేషన్‌ఘన్‌పూర్‌ 

రైతుల ఇష్టం మేరకే తరుగు 
ఎడతెరిపిలేని వర్షాల వల్ల ధాన్యం డామేజ్‌ వచి్చంది. దానివల్ల రైతుల ఇష్టం మేరకే మిల్లర్లు తరుగు తీశారు. ధాన్యం ఆరబెట్టడం, మళ్ళీ వర్షం పడటం పక్షం రోజులు అదే పరిస్థితి. కానీ ఒకసారి తరుగు తీశాక మళ్ళీ తీయడం ఉండదు.     – అన్నమనేని సుధాకర్‌రావు, రైస్‌ మిల్లర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి 

మొత్తం డబ్బులు పడలేదు 
మా ఊరిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మిన. అప్పుడు తరుగుతో 142 బస్తాలు లెక్క గట్టారు. తీరా ఇప్పుడు 138 బస్తాలకే డబ్బులు పడ్డాయి. సెంటర్‌ వాళ్ళను అడిగితే.. మాకేమీ తెలియదు మిల్లు వాళ్ళను అడగమంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు.  –ప్రశాంత్, కౌలు రైతు, చిన్న బొంకూర్, సుల్తానాబాద్‌ 

4.4 క్వింటాళ్ల కోత.. రూ.9,800 నష్టం 
కొనుగోలు కేంద్రం నుంచి మొత్తం 303 బస్తాలు తూకం వేశారు. ఒకలారీలో 199 బస్తాలు పోగా.. ఆరు బ్యాగులు కట్‌ చేశారు. మరో దాంట్లో 104 బ్యాగులు పోయినయి.. ఐదు బ్యాగులు కట్‌ చేశారు. మొత్తంగా 4.4 క్వింటాళ్లు కోతతో మొత్తం రూ.9,800 నష్టం జరిగింది. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.   – విష్ణువర్ధన్, కరీంనగర్‌ 

Advertisement
 
Advertisement
Advertisement