పెళ్లి పీటలపై వరుడుకి షాక్‌ ఇచ్చిన వధువు | Tamil Nadu Bride Given To Shock Groom Last minute | Sakshi
Sakshi News home page

పెళ్లి పీటలపై వరుడుకి షాక్‌ ఇచ్చిన వధువు

Nov 1 2020 2:57 PM | Updated on Nov 1 2020 4:57 PM

Tamil Nadu Bride Given To Shock Groom Last minute - Sakshi

సాక్షి, చెన్నై : కొద్దిసేపట్లో పెళ్లికూతురి మెడలో తాళికట్టే సమయం. పెళ్లి కొడుకు తాళిబొట్టు పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. కాసేపట్లో తాను ఓ ఇంటివాడినవుతానని సంబరపడిపోతున్నాడు వరుడు. ఇంతలో అతగాడికి ఆగమంటూ పెళ్లికూతురు అభ్యర్థన. చివరి నిమిషంలో ఇదేమి ట్విస్ట్‌ అనుకుంటూ పెళ్లికొడుకు అయోమయంగా చూస్తున్నాడు. రీల్‌ సీన్‌ను తలపించేలా రియల్‌ సీన్‌ చోటు చేసుకుంది అక్కడ. సినిమా సీన్లనే తలదన్నేలా పెళ్లి కొడుకు ఆనంద్‌కు షాక్‌ ఇచ్చింది పెళ్లి కూతురు ప్రియదర్శిని.

పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేకపోతే హీరోయిన్‌ మొండికేసి చివరి నిమిషంలో ప్రేమించినవాడితో వెళ్లిపోవడం మనం సినిమాల్లో చూస్తుంటాం..! అయితే ఇది తమిళనాడులో నిజంగానే జరిగింది.  తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడతానంటూ పెళ్లికూతురు తెగేసి చెప్పింది. దీంతో ఒక్కసారిగా వధూవరుల ఇరు కుటుంబాలతో పాటు పెళ్లికి వచ్చిన అతిథులంతా అనుకోని ఈ పరిణామంతో అవాక్కు అయ్యారు. 

తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని ఉదగ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించినవాడు అరగంటలో వస్తాడని  అతడినే పెళ్లాడతానంటూ ప్రియదర్శిని ఖరాఖండిగా చెప్పేసింది. కుటుంబ సభ్యులు ఆమెకు ఎంత నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో ఆగ్రహంతో ఆమెపై చేయి చేసుకునేవరకూ వెళ్లింది పరిస్థితి. ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేస్తున్నారంటూ నిలదీసింది. అయితే ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదని పెళ్లికూతుర్ని బంధువులు ప్రశ్నించారు. మరోవైపు పెళ్లి మండపంలో జరిగిన అవమానం తట్టుకోలేని పెళ్లి కొడుకు ఆనంద్‌ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. 

అక్కడవరకూ బాగానే ఉంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే ప్రేమికుడి పార్తీపన్‌ కోసం పెళ్లి కూతురు అరగంట, గంట వేచి చూసినా చివరకు అతగాడు మాత్రం రాలేదు. దీంతో పెళ్లికూతురుని కూడా ఆమె పెద్దలు మండపంలోనే వదిలేసి బాధను దిగమింగకుంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement