
తిరువళ్లూరు: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని రెండున్నరేళ్ల కొడుకును కడతేర్చిన తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి సమీపంలోని కొరుక్కంబాక్కం గ్రామానికి చెందిన సెల్వప్రకాష్కు భార్య లావణ్య, రెండున్నరేళ్ల కొడుకు సర్వేశ్వరన్ ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో ఇద్దరూ విడిపోయి వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం సర్వేశ్వరన్ ప్రమాదవశాత్తు కిందపడడంతో గాయపడి మృతిచెందినట్టు లావణ్య వైద్యశాలకు తీసుకొచ్చింది.
అనంతరం మృతదేహాన్ని అదే ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించింది. కుమారుడి మృతికి సంబంధించిన సమాచారాన్ని భర్త సెల్వప్రకాష్కు చేరవేయలేదు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం సెల్వప్రకాష్ తన కుమారుడిని చూడడానికి వెళ్లగా స్థానికుల ద్వారా బాలుడు మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని షాక్కు గురయ్యాడు. తన కుమారుడి మృతిలో అనుమానం ఉన్నట్టు మాంగాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.
పోస్టుమార్టం రిపోర్టులో హత్యగా నిర్ధారణ కావడంతో లావణ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో లావణ్యకు అదే ప్రాంతానికి చెందిన మణిగండన్తో వివాహేతర సంబంధం వున్నట్టు తేలింది. తమ సంబంధానికి అడ్డుగా వున్న సర్వేశ్వరన్ను ఇద్దరూ కలిసి హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. లావణ్యతో పాటు ఆమె ప్రియుడు మణిగండన్ను అరెస్టు చేశారు.