సూర్యాపేటటౌన్ : ఉత్తమ సమాజ నిర్మాణం ఉపాధ్యాయులతోనే సాధ్యమని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జరిగిన గురుపూజోత్సవంలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు అవార్డులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. తన జీవిత ప్రయాణంలో గురువుల పాత్రను గుర్తుచేసుకుని, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేను పుట్టి పెరిగింది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలేగావ్ తాలూకా సౌందనే గ్రామంలో నా తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులే కావడంతో నా బడి ప్రయాణం నేను పుట్టిన రోజు నుంచే మొదలైందన్నారు. సాతారాలోని సైనిక్ స్కూల్, ఇంజనీరింగ్, ఆపై యూపీఎస్సీ ప్రస్థానంలో తనకు మార్గదర్శనం చేసిన ప్రతిఒక్క గురువును ఆయన పేరుపేరునా స్మరించుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాలల్లోనూ విద్యాబోధన పద్ధతులు మారాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఎంత సాంకేతికత వచ్చినా, కృత్రిమ మేధ పెరిగినా విద్యార్థిని వ్యక్తిగతంగా సరైన మార్గంలో నడిపించే గురువు స్థానాన్ని ఏ యంత్రమూ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని, ఇక్కడి విద్యా రంగం ప్రస్తుతం ఒక సరికొత్త టేకాఫ్ దశలో ఉందన్నారు. ఈ సందర్భంగా భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్రాజ్, డీఐఈఓ సులోచనరాణి, ఆర్సీఓలు, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఫ గురుపూజోత్సవంలో కలెక్టర్
తేజస్ నంద్లాల్ పవార్
ఫ కలెక్టరేట్లో ఉత్తమ టీచర్లకు
జిల్లాస్థాయి అవార్డులు ప్రదానం


