శాలిగౌరారం : ఆర్థిక సమస్యలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. శనివారం ఎస్ఐ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. అంబారిపేట గ్రామానికి చెందిన బీరం నర్సిరెడ్డి(54) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పంట పెట్టుబడి కోసం అప్పులు చేశాడు. చేసిన అప్పు తీర్చేందుకు గాను తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిని విక్రయించినప్పటికీ అప్పులు పూర్తిస్థాయిలో తీరలేదు. దీనికి తోడు కొంతకాలంగా భుజానికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు అనారోగ్య సమస్యతో మానసికంగా కుంగిపోయిన నర్సిరెడ్డి శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు ఉపేందర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


