ఫ వైజాగ్ కాలనీలో సాగర్ వెనుక
జలాల్లో మునిగి యువకుడి మృతి
చందంపేట : స్నేహితులతో కలిసి నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్ కాలనీకి వచ్చిన యువకుడు సాగర్ వెనుక జలాల్లో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు కలిసి విహారయాత్ర నిమిత్తం నేరెడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీకి శుక్రవారం వచ్చారు. రాత్రి అక్కడే బస చేశారు. శనివారం మధ్యాహ్నం సమయంలో స్నేహితులంతా కలిసి ఈత కొట్టేందుకు సాగర్ వెనుక జలాల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో దుర్గం మల్లేష్(25) అనే వ్యక్తి నీట మునిగిపోయాడు. సమాచారం తెలుసుక్ను ఘటనా స్థలానికి చేరుకుని మల్లేష్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపారు.
కారు ఢీకొని బాలుడు మృతి
మోతె : రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన మోతె మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డు వద్ద శనివారం జరిగింది. రాఘవాపురం గ్రామానికి చెందిన బయ్య సైదులు కుమారుడు మహేష్(14) శనివారం రాఘవాపురం ఎక్స్ రోడ్డు వద్ద గల పీఎన్ఆర్ ఫంక్షన్హాల్లో జరిగిన ఫంక్షన్ హాజరయ్యాడు. ఈ క్రమంలో ఫంక్షన్హాల్ నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటుతుండగా.. సూర్యాపేట వైపు నుంచి ఖమ్మం వైపు వేగంగా వెళ్తున్న కారు అతడిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారు ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


