కోదాడరూరల్ : కోదాడ కోర్టును మోడల్ కోర్టుగా తీర్చిదిద్దేంకు కృషి చేస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద అన్నారు. శుక్రవారం కోదాడ కోర్టు భవన నిర్మాణ పనులను జిల్లా ఒకటవ అదనపు జడ్జి శివరాంప్రసాద్తో కలిసి పరిశీలించారు.పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం కోర్టు హాల్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పనులు త్వరిత గతిన పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని, అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేసుల డిజటలైజేషన్ను వేగవంతం చేసి, వ్యాజ్యదారులకు సత్వర న్యాయం అందిలా కోదాడ కోర్టును ఆదర్శంగా నిలుపుతామన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సబ్ జడ్జి సురేష్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్.లక్ష్మీనారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, రామిశెట్టి రామకృష్ణ, జానిపాషా, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం
సూర్యాపేట అర్బన్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేందుకు ఈ నెల 10న దేశవ్యాప్తంగా నిర్వహించే జైల్భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీపీఎం ఆఫీస్లో నిర్వహించిన సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పులుసు సత్యం, పోసనబోయిన హుస్సేన్, జంపాల స్వరాజ్యం, జిల్లా ఆఫీస్ బేరర్స్ సిరికొండ శ్రీను, సోమ పంగు జానయ్య, కడెంకుమార్ పాల్గొన్నారు.
చెట్టును నరికినందుకు రూ.2వేల జరిమానా
సూర్యాపేట అర్బన్ : మున్సిపాలిటీ పరిధిలోని ఏపూరు బస్టాండ్ వద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోడ్డుపై ఉన్న చెట్టును నరికిన వారికి మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు చెట్టును నరికిన ఇంటి యజమాని వేణుగోపాల్కు రూ.2వేల జరిమానా విధించారు. కార్యక్రమంలో ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ యాదగిరి, వార్డు అధికారి రాజేశ్వరి, సిబ్బంది నవీన్, జాకబ్, రమేష్, మల్లేష్, పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం అర్చకులు స్వామి వారి నిత్య కల్యానాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. నిత్యకల్యాణం అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాఢ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, ఈఓ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


